Wednesday, May 15, 2019

శ్రీసత్తిరాజువేణుమాధవ్ గారికి పరమపదప్రాప్తి.....🙏

శ్రీసత్తిరాజువేణుమాధవ్ గారికి పరమపదప్రాప్తి.....
శ్రీశ్రీనివాసుని ఆరాధన ఒక్కొక్కరు ఒక్కోశైలిలో తమకు దైవము అనుగ్రహించిన విభూతులతో సలిపి ఆ స్వామిని ప్రసన్నం చేసుకుని తరిస్తారు...
అందునా సంగీత సాహిత్య పరంగా శ్రీనివాసున్ని అర్చించడం విశేషమైన జన్మార్జిత పుణ్యఫలంగా లభించే దైవానుగ్రహంతో మాత్రమే సంభవమయ్యే సత్కార్యము...
అన్నమయ్య సంకీర్తన యజ్ఞ్యం అనే గాత్రప్రపంచంలో ఒక్కో విద్వణ్మూర్తిది ఒక్కోశైలి...
అరుదైన అన్నమాచార్యుల సాహిత్యాన్ని అందిపుచ్చుకొని వాటిని అమృతతుల్యమైన
రాగరంజితరసగుళికలుగా తమ స్వరానులేపనం తో మలిచి భక్తభాగవత లోకానికి అందించి
అదే శ్రీనివాసుని శ్రీకార్యంగా భావించి జీవించే అతి కొద్ది మంది భాగవతులలో శ్రీ సత్తిరాజువేణుమాధవ్ గారు కూడా ఒకరు.....
" నీవుగలిగినచాలు...." అనే పేరుతో వారి ఒక అన్నమయ్యకీర్తనల ఆల్బం సుజనరంజని వారి ఆధ్వర్యంలో ( సప్తపర్ణి, బంజారహిల్ల్స్ ) రిలీస్ ఐనప్పుడు మొట్టమొదటి సారి
వారికి మరియు,
ఆరోజు ఆ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసిన అన్నమయ్య సాహిత్యపరిశోధకులు శ్రీతాడేపల్లిపతంజలిగారికి ప్రత్యక్షంగా పాదాభివందనం చేసుకునే సౌభాగ్యం లభించడం ఎన్నటికి మరచిపోలేని జ్ఞాపకం....
ఆనాడు వారు ఆలపించిన కీర్తనల్లో ముఖ్యంగా
"నీవుగలిగినచాలు నిక్కము అన్నీ గలవు...."
మరియు అంత్యమున మంగళస్తుతిగా
"శృంగారశీలునకు మంగళం సంగీతలోలునకు మంగళం...."
శ్రోతలు ఎన్నటికీ మరువలేని వారి మధురస్వరవిన్యాసమంజరులు.....
అప్పుడు వారికి ఆరోగ్యపరంగా కార్డియాక్ సర్జరి జరిగి వైద్యులు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పినా సరే,
స్వామి వారి సంకీర్తనలను స్వరపరిచి ఆలపించడంలోనే తనకు మనశ్శాంతి అని తెలిపి ఈనాటి వరకు కూడా దైవసేవలోనే నిమగ్నమయ్యి, తుదకు స్వామి కడకే పయనమైన పరమభాగవతోత్తములు.....
శ్రీనివాసుని శ్రీచరణాలే జీవితమని భావించి సేవించి తరించిన వారి పాదపద్మములకు
నమస్కరిస్తు, వారి కుటుంబాన్ని స్వామి సదా రక్షించుగాక అని ప్రార్ధిస్తు....
హరిః ఓం తత్ సత్....🙏

No comments:

Post a Comment