Wednesday, August 28, 2019

శ్రీకృష్ణజన్మాష్టమి / గోకులాష్టమి శుభాభినందనలు..😊

శ్రీకృష్ణజన్మాష్టమి / గోకులాష్టమి శుభాభినందనలు..😊
ఈ శుభపర్వదినాన అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాంతర్గతంగా అనుగ్రహింపబడిన శ్రీకృష్ణ తత్వాన్ని కొంత విశదీకరించే చిరు ప్రయత్నం.....
దేవకీవసుదేవులు తమ పూర్వపుజన్మల్లో శ్రీమన్నారాయణుడి గురించి తపమాచరించి, అచ్చం నీలాంటి చిన్నిబాబు మాకు కావాలి స్వామి అని వరాన్ని అర్ధించగా, "నా లాంటి వాడు అంటే ఇక నేనే రావాలి కదా మరి.... అందుకే నేనే మీకు ముమ్మారు పుత్రుడిగా జన్మించి అనుగ్రహిస్తాను...." అని తెలిపిన ఆ పరమదయాళువు పృష్ణిగర్భుడిగా, వామనుడిగా,
శ్రీ శ్రీకృష్ణుడిగా, జన్మించి ఆ వరాన్ని పరిపూర్ణంగావిస్తాడు.....
ఆ వరాన్ని అలా ఒసగడంలో పరమాత్మ ఎన్నెన్నో భవిష్యద్ దేవకార్యాలను దృష్టిలో పెట్టుకొని
భువిపై తన జన్మస్వీకారానికి తానే ఉపాయము ఉపేయము కుదిర్చి ఎన్నెన్నో అధ్యాత్మ రహస్యాలు అందులో నిక్షిప్తం గావించి శ్రీవైకుంఠం నుండి తన తేజో అంశయొక్క జీవప్రయాణాన్ని నిర్దేశించాడు....
హాయిగా చల్లగా ఉండే శేషపర్యంకం పై శయనించి, శ్రీమహాలక్ష్మి అమ్మవారు పాదసంవాహనం గావిస్తుండగా, ఆదిశేషుడి సహస్ర ఫణములు వింజామరలా వీస్తుండగా సేదతీరే ఆ జలజనాభుడు, తన దైవిక ఇంద్రియశక్తులన్నిటితో ఒక తేజోంశను సృజించి నిర్దేశిత అవతారాన్ని స్వీకరించి భూలోకానికి రావాలంటే ఎన్నెన్ని సమాలోచనలు గావించి క్షీరాబ్ధి నుండి కదిలివస్తాడో ఎవ్వరికి తెలియని దేవరహస్యము అది.....
ఆ పావన శ్రీపాదయుగళం ఎక్కడ మోపితే అక్కడ సకల సంపదలను, అష్టైశ్వర్యములను వెంటబెట్టుకొని ఆ శ్రీహరి యొక్క నిత్యాన్నపాయిని ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది కాబట్టి, ఆ శ్రీమన్నారాయణుడు తన భక్తభాగవతులు సత్పురుష సాధువరేణ్యులు, యోగులు, మహర్షులు, ఇత్యాది వారు తననే ఆరాధిస్తూ ఎక్కడెక్కడ కొలువైఉంటారో వారందరికి శ్రేయస్సులు ఒనగూరేలా వివిధ ప్రయోజనాలను యోచించి తన అవతార స్వీకారం చేస్తాడు అన్నది అధ్యాత్మ లోకవిదితమైన సత్యం....
నరనారాయణులుగా సాగే శ్రీకృష్ణార్జునుల పూర్వజన్మపు మైత్రీబంధము ఒకవైపు,
బ్రహ్మగారి మానసపుతృలైన సనకసనందనసనత్కుమారసనత్సుజాతులచే
శాపగ్రస్తులైన తన శ్రీవైకుంఠ ద్వారపాలకులు జయవిజయులకు శాపవిమోచనం గలిగించే క్రమంలో,
హిరణ్యాక్షహిరణ్యకశిపులుగా,
రావణకుంభకర్ణులుగా జన్మించి నిహతులైన తర్వాత ద్వాపరయుగంలో
శిశుపాలదంతవక్తృలుగా జన్మించిన వారిని వధించి తిరిగి శ్రీవైకుంఠానికి వారిని అనుమతింపచేయడం,
శ్రీరామావతారంలో తనను మోహించిన మహర్షులు ద్వాపరంలో గోపికలుగా జన్మించగా వారిని రాసలీలలో అనుగ్రహించి జీవబ్రహ్మైక్యసిద్ధిని అనుగ్రహించడం,
ఇలా వివిధ కార్యసాధనకై తన పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణావతారాన్ని దశావతారాల్లో 8వ అవతారంగా స్వీకరించిన పరమాత్మ తత్వం అత్యంత నిగూఢమయ్యి ఉండికూడా ఎంతో భక్తసులభుడై తనపై ప్రేమాభిమానాలు చూపించినవారందరిని కూడా విశేషంగా అనుగ్రహించిన విశిష్టావాతారం శ్రీకృష్ణావతారం.....
మరే అవతారంలో లేని వైభవం, కానరాని భక్తసౌలభ్యం, ఆశ్రితపారిజాతమై ఉండే భగవద్ తత్వం శ్రీకృష్ణావతారానికే చెల్లినది......
కంసునిచెరసాలలో జన్మించినమరుక్షణమే దేవకీవసుదేవులకు శ్రీమహావిష్ణువై శంఖచక్రధారిగా దర్శనమిచ్చి తన జన్మవృత్తాంతం గురించి తెలిపి మరలా వారికి ఆ సత్యాన్ని మరుగునపరిచి, ఎదురులేని, మనుజులచే ఆపబడని అమేయ కాలప్రవాహానికి సూచికయైన సూర్యపుత్రిక, యమధర్మరాజు సహోదరి యమున తనకు తానుగా వసుదేవునకు నది దాటి నందవ్రజం వెళ్ళడానికి దారి ఇచ్చిన క్షణమునుండి,
ఒక బోయవాని బాణం దెబ్బకు కాలి బొటనవేలికి గాయం అవ్వడంవల్ల జరిగిన తన భౌతిక శరీరత్యాగానంతరం యదుకులముసలంతో ద్వాపరయుగాంతం జరిగే వైనం వరకు ఎన్నెన్నో సందర్భాలలో తన పరమాత్మతత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించిన పరమోత్కృష్ట అవతారం శ్రీకృష్ణావతారం....
"శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనం
అర్చనం వందనం సఖ్యం దాస్యం ఆత్మనివేదనం...."
అని పెద్దలచే చెప్పబడే నవవిధభక్తికి నిదర్శనంగా చెప్పబడే ఒక్కొక్కభాగవతోత్తములలో
పరీక్షిత్ మహారాజు శ్రవణభక్తికి,
అకౄరుడు వందన భక్తికి,
అర్జునుడు సఖ్యభక్తికి,
తార్కాణమైన వీరుముగ్గురు కూడా శ్రీకృష్ణపరమాత్మ యొక్క ద్వాపరయుగపు మహాభారత కాలానికి చెందినవారే అవ్వడం, వీరిలో ఒకరైన పరీక్షిత్ మహరాజునకు వ్యాసమహర్షిపుత్రులైన శ్రీశుకమునీంద్రులు శ్రీమద్భాగవతాన్ని 7 రోజులు బోధించి అది లోకానికి అందేలా చేయడం,
మరియు అర్జునుడికి బోధించిన భగవద్గీత, వ్యాసోక్తమై గణపతిలిఖితమై లోకానికి లభించి భక్తులు లాభించడం,
ఇవ్వాళ కలియుగంలో మనం ఆ పరమాత్మను సేవించుకునే 2 అత్యంత శక్తివంతమైన శ్రేయస్కరమైన సర్వజన సులభమైన
సారస్వతాలు శ్రీమద్భాగవతాంతర్గతమైన
" గజేంద్రమోక్ష స్తోత్రం "
మరియు శ్రీ భీష్మాచార్య
ధర్మరాజసంవాదమైన
" శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం "
భక్తభాగవతలోకానికి అందివ్వడంలో అంతర్లీనంగా కారణమైఉన్నది ఆ శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహమే కద...!
తన బాల్యపు చిన్నికృష్ణ లీలల నుండి బామ్మర్దితో సాగిన తమ బహుచతురతభరిత వ్యూహప్రతివ్యూహాలతో సాగిన మహాభారత సంగ్రామం వరకు ఆ పరమాత్మ ఎందరెందరికో తనదైన శైలిలో అటు భక్తులకు ఉపకారం ఇటు
అసురసమ్హారం గావిస్తు తన జీవితం మొత్తం నమ్ముకున్నవారికోసమే త్యాగంచేసిన అపర కారుణ్యమూర్తి కదా మన శ్రీకృష్ణ స్వామి...!
చిన్ననాటి సాందీపని మహర్షి గురుకుల మిత్రుడైన సుదాముడు ప్రేమతో పెట్టిన పిడికెడు అటుకులను ఆరగించి అష్టైశ్వర్యాలను కలిగించిన ఘనత కదా కన్నయ్యది...!
విదురుడు సమర్పించిన అరటిపండు తొక్కలను ఆప్యాయతతో ఆరగించి అనుగ్రహించిన వైచిత్రి కదా వనమాలిది...!
తననే నమ్ముకున్న అర్జునుడికి అన్నీతానై, ఆపదలను ఆమడదూరంలోనే నిలిపి, అన్నివేళల్లో విజయుడికి విజయాన్ని సమకూర్చిన భక్తపరాధీనతకదా ఆ భక్తవత్సలుడిది...
శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత అంతహ్పురమహిళామణులను క్షేమంగా హస్తినకు చేర్చే సమయంలో అడ్డగించిన దుండగులపైకి కనీసం గాండీవం ఎత్తలేని స్థితిని మనంగమనిస్తే, పార్థునకు ఆ గాండీవాన్ని ధరించి సవ్యసాచిగా వర్ధిల్లే శక్తిని ఇచ్చింది కేవలం
శ్రీకృష్ణ పరమాత్మే యొక్క సాన్నిధ్యం అనే సంగతి తెలపకనే తెలపబడే సత్యం......
కుబ్జ కాసింత గంధం అలదిందని అతిలోకలావణ్యవతిగా చేసాడు...
మాలాకారుడు ఇచ్చిన మూరెడు పూలకు అతన్ని మహదైశ్వర్యవంతునిగా మార్చేసాడు.....
ఇలా ఎందరెందరితోనో ఆ కన్నయ్య కమనీయ మైత్రీబంధాన్ని నెరపి తన మాధవమధులోలత్వాన్ని అనుగ్రహించి వారి జీవితాలను తన అనుగ్రహప్రసాదంతో పరిపుష్టి గావించి తరింపజేసాడు.......
చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ, చేస్తూనే ఉంటాడు ఎప్పటికీ ఆ తిరువేంకటనగముపై శ్రీవేంకటకృష్ణుడిగా వీరస్థాక ధృవమూర్తి గా కొలువైన కలియుగ ప్రత్యక్ష పరమాత్మ......
ఆ నిరతిశయ ఆనంద స్వరూపుడిని అందుకే అన్నమాచార్యులవారు తమ "భావయామిగోపాలబాలం" సంకీర్తనలో...
" తిరువేంకటాచల స్థితం అనుపమం
హరిం పరమపురుషం గోపాలబాలం....."
అంటూ అంత ఆప్యాయంగా పాడి పరవశించారు....!! 😊
ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.COM
Youtube Video : G Balakrishnaprasad Archive Page Audio link : MS Subbalakshmi Audio link SP Sailaja Audio link Vedavati Prabhakar ...

No comments:

Post a Comment