Sunday, November 2, 2025

శ్రీకరమైన 2025 విశ్వావసు కార్తీకమాస పర్వసమయ శుభాభినందనలు...🙂💐


కార్తీకమాసేకృతంపుణ్యం సహస్రగంగాస్నానఫలదం
కార్తీకదామోదరప్రీతికరం కార్తీకత్రయంబకతోషకరం

అని ఆర్యోక్తి....

అనగా..

కార్తీక మాసంలో గావించే పుణ్యం....
సహస్ర (అనంతం అని అర్ధం) గంగాస్నాన ఫలితాన్ని ఒనరించునని అర్ధం...
కార్తీకమాస పుణ్యకార్యం ఒనరించే పుణ్యఫలం
కార్తీక దామోదరునకు ప్రీతికరం మరియు కార్తీక త్రయంబకునకు ఆనందకరం.....
అని వాక్యార్ధం....

ఈ లోకంలోని ప్రతీ విజ్ఞ్యులకు కూడా ఏదో ఒక సద్గుణం, ఏదో ఒక విభూతి, ఏదో ఒక ప్రత్యేకత, ఏదో ఒక వ్యాపకం, ఏదో ఒక కళానైపుణ్యం, ఉండడం ఈశ్వరానుగ్రహం....

అట్టి ఈశ్వరప్రసాదిత
సద్గుణం, విభూతి, ప్రత్యేకత, వ్యాపకం, కళానైపుణ్యం,
ఈశ్వరసేవలో వినియోగింపబడి విశేషమైన పుణ్యార్జనతో తరించగలగడం కూడా ఈశ్వరానుగ్రహమే...

శ్రీ చాగంటి సద్గురువుల వంటి అగ్రశ్రేణిపుణ్యాత్ములచే, వాగధీశ్వరి గా వారి రసనపై ఆ పరేశ్వరి నిలిచి ప్రవచింపజేసిన 
అనంతమైన పౌరాణికవాజ్ఞ్మయార్ణవలహరుల్లో విహరిస్తూ
గంగాస్నానపుణ్యదాయకమైన వారి సద్వాక్కులను భక్తిశ్రద్ధలతో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా.....,

"కురుపుణ్యం అహోరాత్రం....." అని శాస్త్ర ఉవాచ....

ఎందుకంటే, సంచితం నుండి మోసుకొచ్చిన ప్రారబ్ధంలోని పాపపుణ్యాల సమ్మిళిత సమాహారంగా ఎల్లరి జీవితం నిత్య సూర్యోదయసూర్యాస్తమయాలతో పాటుగా గడిచిపోతూ ఉన్నది....

ఇట్టి చిరంతన జీవితకాలప్రవాహంలో పాపం అనేది మనకు తెలియని కారణంగా, మన వశంలో మనం లేని  
కారణంగా, మన రజోగుణ ఉద్ధతి / విస్ఫోటనం
కారణంగా, పోగౌతూ ఉండును....
పుణ్యం మాత్రం మన ప్రయత్నపూర్వక సత్త్వగుణ సాంద్రత / నడవడి కారణంగా, పరిశ్రమతో మాత్రమే 
సమకూరును.....

ఫర్ ఎగ్సాంపుల్ మీరు గమనించండి....

ఒకరేమో....
"అసలే కార్తీక మాసం...అలా ఆలయానికి వెళ్ళి.... లేక ఇంట్లో తులసి మొక్క సన్నిధిలో అయినా దీపారాధన గావించి....,దేవుడా మంచి ఆరోగ్యాన్ని, విద్యాబుద్ధులను, ఐశ్వర్యాన్ని, శ్రేయస్కర సంపత్తును, నిరంతర భగవద్భక్తిని, జీవితకార్యాచరణబాటలో విజయాన్ని అనుగ్రహించు స్వామి....."
అని ప్రార్ధించి పుణ్యాన్ని గడించి తరిస్తున్నారు.....

మరొకరేమో...
"ఊరవరాహంలా తిని ఊరిమీదపడితిరగడానికి ఏమాసం అయితే ఏముందిలే..." అని అనుకుంటూ..
అలా రోడ్డుమీదకి వెళ్ళి.... 
ఏదో ఒక చెత్తను కొనుక్కొని నమిలి ఊసి
రోడ్లను ఎరుపెక్కించి...హమ్మో అప్పుడే మధ్యాహ్నమయ్యిందా అని బాగా తిని కాసేపు నిద్రించి....లేచి...హమ్మో అప్పుడే సాయంత్రమయ్యిందా.....అని మళ్ళీ రోడ్లెక్కి అదే పనిగా రొడ్లకు రంగును, వారి కర్మసంచితానికి పాపాన్ని రంగరిస్తూ, రాత్రి అవ్వగానే మళ్ళీ బాగా తిని కనీసం ఒక్కసారైనా శివనామస్మరణ అయినా చేయకుండా
నిద్రించడం.....
తెలవారగానే.....హుం మళ్ళీ తెల్లారిందా...అని అనుకుంటూ కనీసం ఒక్కసారైనా శ్రీహరి అని కూడా స్మరించకుండా మేల్కొని.....
జీవితం షరామామూలే కదా అని అనుకుంటూ రోడ్లమీద తిరుగుతూ...
తెల్లారిపోతున్న వారి బ్రతుకుబండి దౌర్బల్యానికి వారి చుట్టూ ఉండే వారిపై అనవసరంగా కసురుతూ, మరో పూట, మరో రోజు, మరో వారం, మరో నెల, మరో సంవత్సరం, అని అనుకుంటూ ఏ పుణ్యకార్యమూ చేయకుండా పతనమై పోతుంటారు...

ఈ రెండురకాల వ్యక్తిత్వాలకు భేదం ఎక్కడో తెలుసా....?

వారివారి మనసుకి పట్టిన జాఢ్యం అనేది
క్రమక్రమంగా వారి జీవితానికి పట్టిన అలక్ష్మి గా రూపాంతరం చెంది, ఈశ్వరస్మరణ పట్ల విస్మరణ, విహితకర్తవ్యం పట్ల నిర్లక్ష్యం, పుణ్యకర్మాచరణ పట్ల అలసత్వం...
వెరసి వారి జీవితం ఒక నూతిలో జన్మించి, నూతిలోనే బ్రతికి, నూతిలోనే తెల్లారిపోయే మండూక (కప్ప) జన్మలా వారి జీవితం వారికి వచ్చే జన్మలో ఊరికే బెకబెక అరిచే కప్ప లా జన్మించేందుకు కావలసిన కర్మను కూడబెడుతున్నది అని అర్ధం......

ఎట్టి వస్తువులనైనా సమూలంగా దహించివేసే శక్తి అగ్నిది....
ఎట్టి జాఢ్యాన్నైనా, పాపాన్నైనా సమూలంగా దహించివేసే శక్తి అగ్ని అధిదేవతగా ఉండే కార్తీక మాసానిది...
(కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్ని...కాబట్టి కార్తీకమాసం మొత్తం అగ్నిదేవుడి అధీనమై వర్ధిల్లే పరమపావనసమయం...)

అందుకే మీరు గమనించి ఉండి ఉంటే...
"ఏంటి...మొత్తం కార్తీక మాసంలో ఒక్కసారైనా దీపం వెలిగించలేదా..... ఓరినీ బత్కు***.."
అనే నిష్టూర వాక్యాలు పాతకాలం నాటి పెద్దలు అనే వారు.....
అంటే కార్తీక మాసంలో దీపారాధనకు ఎంత ప్రాధాన్యమో అనేది మన పాత తరం పెద్దలు అలా ఏవో క్యాజువల్ మాటల్లో కూడా చెప్పారన్నమాట....

బాహ్యంలో రాత్రులు అత్యంత చీకటితో ఉండే మాసం కార్తీక మాసం.....
గాలిలో చలి తీవ్రత పెరగడంతో, శరీరాంతర్గత నాడివ్యవస్థ ఇబ్బందులు పడే మాసం ఈ కార్తీక మాసం....

దీపారాధన సాధారణంగా నువ్వులనూనే, లేక ఆవునెయ్యి తో గావిస్తారు.....
తిలల (నువ్వులు) నుండి సంగ్రహమైన తైలం (నువ్వులనూనే),
గంగిగోవు క్షీరము తప్తమవ్వగా లభించే నవనీతం / దధిమథనం నుండి సంగ్రహింపబడిన నవనీతం, తప్తమవ్వగా లభించే స్వచ్ఛమైన శుభ్రమైన గోఘృతం (ఆవునెయ్యి)..,
అధ్యాత్మపరంగా దీపారాధనకు శ్రేష్ఠమైన ఇంధనం అని శాస్త్ర ఉవాచ....

నువ్వులనూనేతో మసాజ్ చేసుకునేవారికి దేహదారుఢ్యం,
ఆవునెయ్యితో భోజనం ఆభిగారం చేసుకొనే వారికి మేధోదారుఢ్యం,
చాలా విశేషంగా ఉండునని ఆయుర్వేదశాస్త్ర ఉవాచ....
అందుకే విజయనగరమహాసామ్రాజ్య వైభవానికి మకుటాయమానమైన కీర్తితో వర్ధిల్లిన ప్రజారంజకపరిపాలకులు,
శ్రీకృష్ణదేవరాయలవారికి బుద్ధిబలం మరియు కండబలం అమితంగా ఉండేవని ఆనాటి పెద్దల మాట....

ఆయుర్వృద్ధిని అనుగ్రహించే ఆయుర్వేదశాస్త్ర వైభవాన్ని నమ్మినవారు మరియు శ్రీహరి దాసులు ఏ పురాణాల్లో ఎంత వెదికినా చెడరెన్నడును.....

నువ్వులనూనెలో ఉండే ఆరోగ్యకరమైన లిగ్నన్స్ మరియు టొకొఫెరాల్స్ అనే ధాతువులు దీపారాధన ద్వారా డైరెక్ట్ గా ఆ ఆరాధకుడి నాడివ్యవస్థ పై ప్రసరించి సద్యోఆరోగ్యకారకశక్తిని కలిగించును....అని ఆయుర్వేదశాస్త్ర ఉవాచ...

నువ్వుల నూనే గురించి గూగుల్ చేసి ఈ క్రింది సమాచారాన్ని ఎవ్వరైనా చదవచ్చు...

***********************************************

Lignans: A group of compounds that includes SESAMIN, SESAMOLIN, AND SESAMOL.
Tocopherols: A form of Vitamin E, with gamma-tocopherol being the most abundant.

Sesamin, sesamolin, and sesamol benefit heart health by reducing cholesterol and blood pressure, and by combating inflammation and oxidative stress, which are major factors in cardiovascular disease. These compounds can help regulate lipid metabolism, prevent the buildup of arterial plaque, and improve overall heart function. 

***********************************************

శరీరానికి కాల్షియం ని గ్రాహ్య పరిచి దృఢత్వాన్ని ప్రసాదించే శక్తి నువ్వులనూనేతో కావించే దీపారాధనకు ఉన్నది అని సైన్స్ కూడా నిర్ధారించింది....

ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా శరీరాంతర్గత జవసత్త్వాలను మెరుగుపరిచే శక్తి, వేయించిన నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసే లడ్లకు ఉన్నదనే సత్యం ఎల్లరికీ తెలిసిందే...
(మితంగా మాత్రమే స్వీకరించవలెను సుమా..లేనిచో అతిఉష్ణత్వం కలుగును)

కార్తీక త్రయంబక దేవతాభ్యో నమః, కార్తీక దామోదర దేవతాభ్యో నమః, అని ప్రత్యేకంగా శివకేశవ నామాలను ఈ కార్తీకమాసంలో ఆరాధించడంలో గల ఆంతర్యమేమి అని తెలుసుకోవాలంటే....,

అసలు దామోదరుడు అనే గౌణానికి అర్ధం ఏంటి...?
త్రయంబకుడు అనే గౌణానికి అర్ధం ఏంటి...?

అనే అధ్యాత్మవిజ్ఞ్యానాంశాలను శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతాంతర్గత శ్రీకృష్ణలీలామృత ప్రవచనాల్లో
దామోదరలీల / ఉలూకలబంధనం....,
శ్రీఉమామహేశ్వరవైభవం ప్రవచనాల్లో 'త్రయంబకాయ', 'త్రయంబకేదేవి' అనే అధ్యాత్మ అంశాలను శ్రద్ధగా ఆలకించిన వారికి విదితమౌను...

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ...

"వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం"
అనగా
సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మువ్వురు దేవతా తత్త్వాలు 3 నేత్రాలుగా గల ఓ ముక్కంటి, ఓ ముకుంద ప్రియా నీకు వందనం...

శ్రీమహావిష్ణుస్వరూపంగా ఆరాధింపబడే ఉశిరిచెట్టు అమేయమైన మహిమోపేతవైభవంతో అలరారే ఔషధీఅమృత ఫలాలైన ఉశిరికాయలను అనుగ్రహించడం ప్రారంభమయ్యే మాసం కూడా కార్తీకమాసమే....

కమ్మని చింతపండురసం / పచ్చిపులుసు లో 
జిలకర, ఆవాలు, ఎండుమిరప, కలగలిపి ఘుమఘుమలాడే పోపుపెట్టడం ఎట్లాగో....,
ఈ కార్తీక మాస ఆరాధనల్లో,

ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి 
పుత్రాందేహి మహాప్రాజ్ఞ్యే యశోదేహి బలంచమే
మేధాంప్రజ్ఞ్యాంచసౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం
నిర్రోగం కురుమామ్నిత్యం నిష్పాపం కురు సర్వదా

అనే శ్లోకంతో ఉసిరిచెట్టుకి ప్రార్ధనా నమస్కారం గావించడం..
మరియు

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః,
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః,
భవన్తి త్వం శ్వపచాహి విప్రాః || 

అనే శ్లోకంతో కార్తీక దీపానికి ప్రార్ధనా నమస్కారం గావించడం

కూడా అట్లే అమోఘమైన ఫలితాలను ఒనరించును అని సద్గురువాక్కులను ఆలకించిన విజ్ఞ్యులకు ఎరుకే కదా..

ఇక కార్తీకమాసంలో నదీతీర్థస్నానం కూడా గొప్ప పుణ్యాన్ని అనుగ్రహించే క్రతువు....
ఎందుకంటే......

"హే అగ్ని దేవా...
నీవు సర్వకాలసర్వావస్థల్లోనూ పరమపవిత్రుడవై వర్ధిల్లెదవు...
నీలో తప్తమవ్వని తత్త్వముండజాలదు....
దేవతలకు స్వాహాకారంతో ,
పితృదేవతలకు స్వధాకారంతో,
నీద్వారా సమర్పింపబడే హవ్యకవ్యములు ఈ లోకానికి నిత్యశ్రేయస్సును ఒనరిస్తూ ఉండును....
నిత్యం అగ్ని ఆరాధన గావించే విజ్ఞ్యులు పరమపవిత్రమైన అగ్నిహోత్రులుగా వర్ధిల్లెదరు.....
వారి రసనపై వాగ్దేవతలు కొలువై ఉందురు....అస్తు....."
అని అగ్నిదేవునకు పరమశివుడు వరాన్ని ప్రసాదించారు...

మరియు....

"హే క్షీరసాగరోద్భవ చంద్రదేవ...
మా శిరోభూషణంగా మిమ్మల్ని / మీ యొక్క శుక్లపక్ష తృతీయ చంద్రరేఖను అలంకరించుకొని మేము చంద్రశేఖరుడిగా,
చంద్రమౌళీశ్వరుడిగా వర్ధిల్లెదము....
శుద్ధ ప్రతిపత్ మొదలు శుద్ధ చతుర్దశి పర్యంతం ప్రవర్ధమానమౌతూ పౌర్ణమి నాడు షోడశకళలతో వర్ధిల్లే మిమ్మల్ని ఆరాధించినవారికి, శ్రీచక్రనవావరణదేవతానుగ్రహం లభించి తరించెదరు....
పౌర్ణమిచంద్రుణ్ణి పార్వతీపరమేశ్వరుల సమ్మిళిత పరిపూర్ణశోడషకళాత్మక స్వరూపంగా ఆరాధించే విజ్ఞ్యులకు సకల సిద్ధౌషధీతత్త్వము అనుగ్రహింపబడును....
యజ్ఞ్యవేదిలో సమర్పింపబడే సోమరసం యొక్క అనుగ్రహఫలమే అట్టి భక్తుల కరకమలకృత అగ్నిక్రతువు
యొక్క అనుగ్రహఫలంగా ఒప్పారును...అస్తు...."

అని చంద్రదేవునకు పరమశివుడు వరాన్ని ప్రసాదించారు...

పౌర్ణమి తిథికి అధిపతి చంద్రుడు షోడశకళాప్రపూర్ణుడిగా అలరారుతూ,
కార్తీక పౌర్ణమి కి కారకమై ఉండే కృత్తికా నక్షత్రాధిదేవతగా అగ్నిదేవుడు అలరారుతూ,
ఉండే కార్తీక పౌర్ణమి తిధి నాడు పరమేశ్వర జటాజూటంలో బంధింపబడిన గంగాదేవికి ఎంతటి మాహాత్మ్యం అమరునో కదా....!

ఈ భరతభూమిపై ప్రవహించే అన్ని నదులకూ కూడా గంగ యొక్క శక్తి అంతర్వాహినియై లభ్యమౌతూ ఉన్న కారణంగా, కార్తీక మాసంలో నదీ తీర్థ స్నానం గొప్ప పుణ్యఫలదాయక
అధ్యాత్మకృతువుగా భాసిల్లుచున్నది.....

చంద్రసహోదరిగా శ్రీమహలక్ష్మి
గంగాజనకుడిగా శ్రీమహవిష్ణువు
గంగాధరుడిగా, సోమేశ్వరుడిగా
శ్రీకంఠుడు, చంద్రమౌళీశ్వరుడు
ఆరాధింపబడుచున్న కారణంగా 
హరిహరప్రీతికరమైన ఈ కార్తీకమాసమాహాత్మ్యం అమరులుకొనియాడే అమేయపుణ్యార్ణవం....

కలియుగ ప్రత్యక్ష పరమాత్మ,
శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో,
వారివారి భక్తిశక్తియుక్తికొలది, భక్తులెల్లరూ ఈ పరమపావనమైన కార్తీక మాసంలో విశేషమైన భగవదారాధనతో, 
విశిష్ఠమైన పుణ్యసంచయంతో, తరించెదరని ఆకాంక్షిస్తూ,
కార్తీక మాస మొదటి సోమవార పర్వసమయ శుభాభినందనలు...💐🙂

తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్యైర్ మహోభి రభూత మహేంద్ర నీలౌ !
ఉద్యాన్నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే !!

సర్వం వేములవాడ శ్రీరాజరాజేశ్వరీ సమేత శ్రీరాజరాజేశ్వర సన్నిధి స్థిత శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙂🙏

No comments:

Post a Comment