కళ్యాణాద్భుతగాత్రాయ
కామితార్థప్రదాయినే
శ్రీమద్వేంకటనాథాయ
శ్రీనివాసాయమంగళం
ఎంతో ఆనందకరమైన ఆంతర మనఃశాంతిని, ప్రశాంతమైన నిద్రను కూడా అనుగ్రహించే నీలాంబరి రాగంలో ఆలపించబడిన ఈ క్రింది అన్నమాచార్య సంకీర్తనను మీరెప్పుడైనా వినిఉండి ఉంటే,
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు స్వామివారిని
"భరిత కళ్యాణగుణ ప్రహ్లాద వరదా..." అని ఎంతో గొప్పగా స్తుతించడం మనం గమనించవచ్చు......
పరిపూర్ణ గోవింద ప్రహ్లాద వరదా |
భరిత కళ్యాణగుణ ప్రహ్లాద వరదా ||
https://annamacharya-lyrics.blogspot.com/2010/07/712anamda-nilaya-prahlada-varada.html?m=1
సనాతనధర్మ అధ్యాత్మ చరిత్రలో, పురాణేతిహాసాల్లో, ఎందరో మేటి భక్తులు, కవికోవిదులు, భక్తభాగవతోత్తములు కలరు....
వారందరిలోకూడా భక్తప్రహ్లాదులవారిది ఎంతో ఆశ్చర్యకరమైన అమరవందిత అగ్రస్థానం....
ఎంతగా అంటే నవవిధ భక్తిమార్గాల్లో ఆత్మనివేదనాభక్తికి ప్రతీకగా బలిచక్రవర్తి ఇప్పటికీ గౌరవింపబడడం అధ్యాత్మలోకానికి ఎరుకే....
(భక్తప్రహ్లాదుల కొడుకు విరోచనుడు, భక్తప్రహ్లాదుల మనవడు బలిచక్రవర్తి)
శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాదసేవనం!
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మనివేదనం!!
1.భగవత్కథాశ్రవణము : పరీక్షిత్ మహారాజు గారు
(వారి అసలు పేరు విష్ణురాతుడు)
2. ఈశ్వరమహిమాసంకీర్తనం : భక్తప్రహ్లాదులవారు
3. భగవన్నామస్మరణ : శ్రీనారదమహర్షివారు
4. విష్ణుపాదసేవ : శ్రీమహాలక్ష్మీదేవి
5. పూజ : పృథుమహరాజు / అంబరీషమహారాజు
6. నమస్కరించుట : అక్రూరుడు
7. సేవచేయుట : శ్రీఆంజనేయుడు
8. స్నేహము : అర్జునుడు
9. ఆత్మనివేదనము : బలిచక్రవర్తి
భక్తప్రహ్లాదుల వారు ఎందుకు అంత గొప్ప భక్తులుగా నవవిధభక్తుల్లో విష్ణుసంకీర్తన భక్తికి ప్రతీకగా వినుతింపబడుతున్నారో,
అట్టి భక్తప్రహ్లాద భక్తితరంగాల్లో తనను తాను
"స్తంభోద్భవ ఉగ్రనారసిమ్హమూర్తి" గా ఆవిష్కరింపజేసుకున్న ఆ నరసిమ్హుడి శక్తి ఎంత గొప్పదో అధ్యాత్మ లోకానికి విదితమైన అంశమే...
అటువంటి శ్రీవేంకటనారసిమ్హ స్వామి వారి కళ్యాణగుణగాన భావలహరుల్లో విహరిస్తూ ఈశ్వరానుగ్రహంతో భగవద్ నామస్మరణవైభవాన్ని కొంత వివేచన గావించి తరిద్దాం......
1. శ్రీఅనంతాళ్వార్ (స్వామి వారికి ఆసనంగా, శయ్యగా, పాదపీఠంగా, వింజామర గా, శ్రీవైకుంఠసేవాగ్రగణ్యుల్లో ముఖ్యులైన శ్రీఆదిశేషుల వారు)
2. శ్రీగరుడాళ్వార్ (స్వామి వారి వాహనమైన శ్రీగరుత్మంతులవారు)
3. శ్రీచక్రత్తాళ్వార్ (స్వామి వారిచే ధరింపబడి ఉండే సాటిలేని సుదర్శనచక్రం)
4. పాంచజన్యం (స్వామి వారిచే ధరింపబడి ఉండే సాటిలేని శంఖం)
5. కౌమోదకి (స్వామి వారు ధరించే సాటిలేని గద)
6. శార్ఙ్గము (స్వామి వారు ధరించే సాటిలేని ధనస్సు)
7. నందకం (స్వామి వారు ధరించే సాటిలేని ఖడ్గం)
8. శ్రీమహాలక్ష్మీదేవి (స్వామివారికి నిత్యం పాదసంవాహనం గావిస్తూ పరిఢవిల్లే స్వామివారి నిత్యాన్నపాయిని)
9. శ్రీవైకుంఠజీవవాహినిగా వర్ధిల్లే విరజాతీర్ధోద్భవ దైవిక పద్మం (కమలం పువ్వు)
10, 11. జయుడు, విజయుడు గా వర్ధిల్లే, శ్రీవికుంఠమహర్షి గారిచే నిర్మితమైన, శ్రీవైకుంఠపురి యొక్క ద్వారపాలకులు.
12. ప్రతినిత్యం నారాయణస్మరణ గావిస్తూ శ్రీవైకుంఠపురికి తరచుగా విచ్చేస్తూ స్వామివారితో సకలలోకాల్లో వర్ధిల్లే స్వామివారి భక్తుల గురించి మరియు స్వామివారికి ఇష్టమైన లోకకళ్యాణక్రతువుల గురించి చర్చించే త్రిలోకసంచారులైన శ్రీనారదమహర్షి వారు...
క్షీరసాగరంలో ఈ ద్వాదశ / 12 తత్త్వములతో నిత్యకళ్యాణం పచ్చతోరణం గా వర్ధిల్లే శ్రీవైకుంఠపురం నుండి వీరందరూ కూడా వివిధరూపాల్లో ఎవ్విధంగా ...
శ్రీభద్రగిరికిపై వెలసిన శ్రీవైకుంఠరామనారాయణుడి సేవకు తరలివచ్చారో శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో ఈ క్రింది దాశరథీశతకపద్యాన్ని ఎంతో వైభవోపేతంగా వివరించడం విజ్ఞ్యులకు ఎరుకే....
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ.
అది శ్రీభద్రాచలం అయితే శ్రీరామనారాయణుణ్ణి సేవించడానికి శ్రీవైకుంఠపురీపరివారం ఒకలా వస్తారు....
అది శ్రీవేంకటాచలం అయితే శ్రీశ్రీనివాసుణ్ణి సేవించడానికి శ్రీవైకుంఠపురీపరివారం ఇంకోలా వస్తారు....
అది శ్రీసిమ్హాచలం అయితే శ్రీవరాహనృసిమ్హస్వామివారిని సేవించడానికి శ్రీవైకుంఠపురీపరివారం ఇంకోలా వస్తారు....
భక్తులకు తెలిసినా, ఇంకా తెలియకున్నా,
ఎక్కడెక్కడ స్వామివారు లోకకళ్యాణార్ధమై, భక్తులకు ఒసగిన వరాలకై, ఎట్లెట్లు అవతారం స్వీకరించి ఏతెంచెదరో....,
ఎట్లెట్లు మూర్తీభవించి కొలువైఉందురో....,
ఎట్లెట్లు ప్రతిష్టింపబడి నెలకొనిఉందురో....,
అట్లట్లు అక్కడికి యావద్ శ్రీవైకుంఠపురీపరివారం కూడా శ్రీమహావిష్ణువుచే నిర్దేశింపబడిన వారివారి రూపాల్లో ఏతెంచెదరు....
కొన్ని క్షేత్రాల్లో ప్రత్యక్షంగా, మరి కొన్ని క్షేత్రాల్లో ప్రచ్ఛన్నంగా, కొన్ని క్షేత్రాల్లో ప్రస్ఫుటంగా, మరి కొన్ని క్షేత్రాల్లో లీలగా, ఇలా వారివారి నిర్దేశిత శ్రీవైష్ణవసేవాకైంకర్యనిమిత్తమై స్వామివారి అనుజ్ఞ్య మేరకు ఒక్కో పుణ్యక్షేత్రంలో ఒక్కోలా శ్రీవైకుంఠపురీపరివారం వారివారి సూక్ష్మ స్థూల యోగ స్థాయిలో కొలువైఉండి తత్ క్షేత్రంలో వెలసి కొలువై ఉన్న శ్రీమహావిష్ణువును ఆరాధిస్తూ ఉంటారు అని ప్రాచీన విజ్ఞ్యుల, శ్రీవైష్ణవభాగవతోత్తముల ఉవాచ....
మీరు గమనించి ఉండి ఉంటే,
మన సి.ఎం గారో, పి.ఎం గారో, ఎదేని ఒక సభాప్రాంగణానికి విచ్చేస్తున్నారంటే...
అక్కడికి వారి క్యాబినెట్ మంత్రులు, వివిధ ఐ.ఎ.ఎస్ / ఐ.పి.ఎస్ ఆఫీసర్స్, వ్యక్తిగతరక్షకసిబ్బంది, ప్రభుత్వ రక్షణశాఖాసిబ్బంది, ప్రఛ్చన్నంగా అక్కడక్కడా ఉండేలా
వ్యవస్థీకృత ప్రభుత్వ స్పై నెట్వర్క్ / గూఢచారవ్యవస్థ, ఇత్యాదిగా సి.ఎం.ఒ / పి.ఎం.ఒ పరివారం మొత్తం తరలిరావడం గురించి చదివి / విని ఉంటారు కద.....
అట్లే సర్వలోకపరిపాలకుడు / సర్వభూపాలపాలకుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడెక్కడ అవతరించి, ప్రతిష్టింపబడి,
(స్వయంవ్యక్త, దేవతాప్రతిష్ట, ఋషిప్రతిష్ట, మానుషప్రతిష్ట అను నాలుగు రకాలుగా ప్రతిష్టితమైన భగవణ్మూర్తులు ఈ లోకంలో అనాదిగా ఆరాధింపబడుతూ ఉన్నాయ్...) ఉండునో అక్కడికి
జన్మజన్మలుగా స్వామివారి శ్రీపాదసేవాకైంకర్యాల్లో తరిస్తూ జీవించిన శ్రీవైష్ణవభూసురోత్తములు మరియు ఇతర భక్తభాగవతోత్తములు తరలివచ్చి స్వామివారి వైభవం నిత్యం ఇనుమడింపబడేలా సేవిస్తూ ఉండెదరు.....
ఒక న్యాయవాది / న్యాయమూర్తి గారికి ఉండే ప్రధాన విభూతి దీర్ఘమైన, లోతైన పరిశీలనాత్మక వివేచన....
ఒక పోలీస్ ఆఫీసర్ గారికి ఉండే ప్రధాన విభూతి అన్ని పరిస్థితుల్లోను పురప్రజారక్షక నైపుణ్యం....
ఒక డాక్టర్ గారికి ఉండే ప్రధాన విభూతి రుగ్మత యందు మరియు తత్ నివారక ఔషధముయందు లోతైన అవగాహన మరియు నైపుణ్యం....
ఒక సత్బ్రాహ్మణాచార్యులవారికి ఉండే ప్రధాన విభూతి కంచు కంఠం మరియు విహితకర్తవ్యాచరణగా అనుసంధించవలసిన భగవదారాధనామంత్రభాగము యందు ఎనలేని పట్టు మరియు విశ్వాసం/గౌరవం....
అప్పుడే
ఆ న్యాయవాది గారికి / న్యాయమూర్తి గారికి ధర్మదేవత / న్యాయదేవతానుగ్రహంగా....,
ఆ పోలీస్ ఆఫీసర్ గారికి దేవసేనాధ్యక్షుల అనుగ్రహంగా...,
ఆ డాక్టర్ గారికి ధన్వంతరిదేవతానుగ్రహంగా...,
ఆ సత్బ్రాహ్మణాచార్యులవారికి తన్మూలంగా తత్ ఆరాధిత ఆలయ దేవతామూర్తికి శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహంగా...,
వారివారిచే నిర్వహింపబడే విహితకర్తవ్యాచరణ సిద్ధిని గడించి వారిచే ఈ లోకానికి ఎనలేని హితం గావింపబడి ఎల్లరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యైశ్వర్యాలతో, వర్ధిల్లెదరు...
మన వివేకానందనగర్ కాలనిలో 35 సంవత్సరాల క్రితం చైత్ర శుద్ధ సప్తమి నాడు శ్రీవైష్ణవాచార్యశిఖామణులచే శ్రీపాంచరాత్రాగమోక్త ఆరాధనాకైంకర్యాల ఉత్సవంతో ప్రతిష్టింపబడి మూర్తీభవించిన శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీశ్రీనివాసుడి శ్రీవైష్ణవవైభవం భక్తులకు లభించిన భూలోకస్థితదేవపారిజాతతరురాజం....
శ్రీమాన్ కోసూరి రామకృష్ణమాచార్యుల వారు మరియు
శ్రీమాన్ కోసూరి రాఘవాచార్యుల వారి స్వరవైభవంతో సంతసిస్తున్న స్వామివారి త్రిపుష్కరసంవత్సర
భక్తవాత్సల్యవైభవం గురించి ఆలయానికి విచ్చేసే భక్తిలెల్లరికీ విదితమే.....
ఈ క్రింది శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలో స్వామివారి వైభవాన్ని తరచి విజ్ఞ్యులెల్లరూ తరించెదరని ఆకాంక్షిస్తూ, ఎల్లరికీ ఇవ్వాళ్టి పరిణయోత్సవంలో పరిపరి విధముల భక్తుల హృదయాల్లో శోభిల్లిన శ్రీభూ సమేత శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామి వారి అత్యంత విశేషమైన అనుగ్రహంతో భక్తులెల్లరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లెదరు గాక.....
************************************
ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||
మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు
తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ
తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు ||
పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||
https://annamacharya-lyrics.blogspot.com/2007/09/301itanikamte-maridaivamu.html?m=1
శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసమ్
శ్రితచేతనమందారం శ్రీనివాసమహంభజే
ఓం నమో వేంకటేశాయ 🙏💐😊
సర్వే సుజనాః సుఖినోభవంతు...💐
********************************
No comments:
Post a Comment