Tuesday, May 19, 2026

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 618వ జయంత్యుత్సవ శుభాభినందనలు....🙂💐


బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||

అని ఎంతో గొప్పగా నుడివారు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల మనవలైన శ్రీ చినతిరుమలాచార్యులు వారి ఈ క్రింది సంకీర్తనలో...

https://annamacharya-lyrics.blogspot.com/2007/09/302appani-varaprasadi.html?m=1

వారి తాత గారు తాళపత్రాలపై లిఖించిన వెలకట్టలేని శ్రీవేంకటముద్రాంకిత శ్రీశ్రీనివాససంకీర్తనాసారస్వతసుధామృతనిధిని ఎంతో గొప్ప మనసుతో భావితరాలకు అందిరావాలని రాగిరేకులపై వారి
పుత్రులైన శ్రీపెద్దతిరుమలాచార్యులు మరియు
పౌత్రులైన శ్రీచినతిరుమలాచార్యులు లిఖింపజేసి భద్రపరిచి, వారు కూడా కొన్ని గొప్ప సంకీర్తనలను శ్రీవేంకటేశ్వరపదాంకితం గావించి తరించారు అని పెద్దలు, చరిత్రకారుల వచనం....

(తాళవృక్షం అనగా విరివిగా ఊర్లల్లో పెరిగే తాటిచెట్టు నుండి గైకొని తయారుగావింపబడిన పత్రాలను తాళపత్రములు అని అందురు....అప్పట్లో ఇప్పుడు మనకు లభ్యమయ్యే పేజెస్ / కాగితం ఇంకా కనుక్కోబడలేదు...)

మీరెప్పుడైనా బాగా చదువుకొని ఎన్నో ప్రైజెస్ బహూకరింపబడిన వారి ఇంటికి ఎప్పుడైనా వెళ్ళిఉండి ఉంటే.....

వారికి గౌరవార్ధమై లభించిన ఆ సోవనీర్స్ / మొమెంటోస్ / కప్స్ / ట్రోఫీస్ / వారి హాల్ రూం లో షోసెల్ఫ్ లో అందంగా అమర్చబడిఉండి, ఇంటికి వచ్చిన వారికి వారి ఇంట్లోని వారు...

ఇది మా వాడికి 2వ తరగతిలో క్లాస్ టాపర్ గా వచ్చినందుకు యాన్యువల్ డే లో వాళ్ళ క్లాస్ టీచర్ మిసెస్ రొఫీనా మ్యాడం బహూకరించిన రోల్డ్ గోల్డ్ మెడల్...

అది మా వాడికి 5వ తరగతిలో క్లాస్ టాపర్ గా నిలిచినందుకు వాళ్ళ తెలుగు టీచర్ శ్రీమతి నాగసూర్యకళ గారిచే బహూకరింపబడిన మొమెంటో...

ఇదిగో చూసారా...మా వాడికి 7వ తరగతిలో జీవా సంస్థవారు నాగార్జున మోడెల్ స్కూల్ లో నిర్వహించిన ఇంటర్ స్కూల్ క్విజ్ కాంపిటిషన్లో రెండో బహుమతి వచ్చినప్పుడు బహూకరింపబడిన మొమెంటో ఇది....

అదిగో చూసారా...మా వాడు 10వ తరగతిలో స్కూల్ టాపర్ గా నిలిచినందుకు శ్రీహరిహరాకళాభవన్లో హైదరాబాద్ స్కూల్స్ అస్సొసియేషన్ వారిచే బహూకరింపబడిన మొమెంటో అది...

ఇలా వారివారికి లభించిన ఆ కాలం నాటి మధుర జ్ఞ్యాపికలను జ్ఞ్యాపకాలను జ్ఞ్యప్తికి వచ్చేలా ఇతర మాన్యులతో నెమరువేసుకుంటూ ఉండడం గురించి విజ్ఞ్యులకు విదితమే...

కేవలం ఒక వ్యక్తికి లభించిన లౌకిక మధురస్మృతులను వారు అంత గొప్పగా భద్రపరుచుకొని లోకానికి చాటి చెప్తూ ఉంటారే....
మరి యావద్ లోకాభ్యున్నతికై కంకణబద్ధులై శ్రీహరి నందకఖడ్గాంశలో ప్రభవించిన శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులు అనుగ్రహించిన అమరవందిత శ్రీహరిసంకీర్తనాసారస్వతాన్ని ఈ లోకంలోని భక్తులు, విజ్ఞ్యులు, పండితులు, భాషాకోవిదులు, చరిత్రకారులు, అధ్యాత్మవేత్తలు, ఇత్యాది మాన్యులు ఎంత గొప్పగా లోకానికి చాటి చెప్పాలి....?

అందుకే శ్రీపెదతిరుమలాచార్యులు, మరియు శ్రీచినతిరుమలాచార్యులు వారి ఆచార్యులు కూడా అయిన శ్రీతాళ్ళపాక అన్నమార్యుల శ్రీహరిసంకీర్తనాసంపుటిని రాగిరేకుల ద్వారా లోకంలో ప్రచరింపజేసి ధన్యులైయ్యారు....

దుష్టులకు దూరంగా ఉండవలెను అనే నానుడిని మా తెలుగు టీచర్ శ్రీమతి నాగసూర్యకళ గారు బోర్ద్ మీద తరచుగా రాస్తూ ఉండేవారు...
బహుషహా అలాంటి కొందరి దుష్టుల కంటపడి కనుమరుగైపోకుండా ఉండేలా నాలుగు శతాబ్దాలుగా అన్నమాచార్య భాండాగారంలో శ్రీయోగనారసిమ్హుడి యోగశక్తితో, శ్రీభాష్యకారుల తపోశక్తితో, రక్షింపబడుతూ గత 5 దశాబ్దాల్లో మన దేశం విజ్ఞ్యులతో కూడిన అభివృద్ధిచెందుతున్న దేశంగా పరిణమించిన తదుపరి శ్రీవేంకటేశ్వరుడి విశేషానుగ్రహంతో ఈ శ్రీహరిసంకీర్తనాసంపుటి 
వివిధ భాషాకారులచే పరిష్కరింపబడుతూ తగురీతిలో
సుస్వర శ్రీవేంకటహరిసంకీర్తనలుగా వివిధ సుప్రసిద్ధ గాయకగాయనీమణులచే భక్తలోకానికి అందివచ్చి ఎల్లరూ
ఆలకించి ఆలపించి తరించడం అనే ప్రక్రియ గురించి విజ్ఞ్యులకు విదితమే....

"వేదానాం సామవేదోస్మి" అని సెలవిచ్చాడు శ్రీకృష్ణపరమాత్మ గీతాచార్యుడిగా.....

ఎందుకంటే సామవేదానికి అనాదిగా ఎంతో మిక్కుటమైన లోకోపకారశక్తి, జనరంజకశక్తి, జనహితకరయుక్తి, అనేది గౌణంగా భాసిల్లే అంశం...

కలియుగప్రభావం రీత్యా వేదం పట్ల గౌరవమరియాదలు, వైదికధర్మంపట్ల గౌరవాభిమానములు,
వేదవిదుల, వేదపాఠశాలల సంఖ్య,
తగ్గుముఖం పడుతూ సమాజం ఒక అనివార్యమైన ఆధునిక సంకరసమూహంగా పరిణమిస్తూ
మేడిపండుచూడ మేలిమైఉండు అన్నచందంగా ఏ పుష్టితుష్టి,
ప్రయోజనం, ప్రాభవం, శ్రేయోప్రభావం లేని 
ఆధునికవ్యాపకాలతో కల్లోలకడలికెరటంలా ఆంతరశాంతిసౌఖ్యాలను స్థాపించలేని ఎండమావిలోనీటిభాసలా రభసకారక రసహీన వ్యాపకాలే ఇక్కాలమునందు ఎక్కువ ....

అందుకే ఆ పరమాత్మ తనకు ఎంతో ఇష్టమైన సామవేదానికి ఉపవేదమైన గంధర్వవేదమైన గాంధర్వం / గంధర్వశాస్త్రం  /  సంగీతశాస్త్రం తో దైవత్వాన్ని లోకంలో మిక్కుటంగా, రసయుక్తంగా, రాగతాళభరితంగా, రంజకత్వంతో, రమణీయమధురాలాపనతో, శ్రోతలను ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉండే శబ్దసౌందర్యంతో శోభిల్లే సంకీర్తనలను వివిధ మహానుభావుల, పుణ్యమూర్తుల, కారణజన్ముల, కోవిదుల, మాన్యులచే లోకానికి
అనుగ్రహింపజేసి యావద్ ప్రపంచాన్ని శ్రేయోదాయక భక్తిరసడోలికల్లో విహరింపజేయిస్తూ సంతసిస్తున్నాడు...

ఎందుకంటే.....

నాహంవసామివైకుంఠే నయోగిహృదయేరవౌ
యత్రమద్భక్తాఃమమగాయంతి తత్రతిష్ఠామ్యహం నారదా

అని శ్రీనారదమహర్షి వారికి భగవంతుడు సెలవిచ్చాడు కాబట్టి...,

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో నారదమహర్షి వారి పేరుకి గల అర్ధం గురించి విజ్ఞ్యులు వినే ఉంటారు కద....
"నారం దదాతి ఇతి నారదః" అనే వ్యుత్పత్తి ప్రకారంగా నారము అనగా జ్ఞ్యానము....అట్టి జ్ఞ్యానాన్ని అనుగ్రహించే వారే శ్రీనారదమహర్షి వారు...

అట్టి శ్రీనారదమహర్షి వారికే భగవంతుడు చెప్పిన వచనం...
నా భక్తులు నన్ను ఎక్కడెక్కడ గానం చేస్తూ ఉంటారో.....
అక్కడక్కడ నేను ఉంటూఉంటానోయ్...
అని...

మరి అట్టి భగవద్ప్రీతికరమైన సంగీతసారస్వతసమ్మిళిత భగవద్గుణగౌణగానం ప్రసాదించే సర్వోన్నతమైన సుజ్ఞ్యానం ఎట్టిదో విజ్ఞ్యులకు ఎరుకే...

పరమాత్మను, పరతత్త్వాన్ని ప్రస్ఫుటంగా ఎరుకపరిచి అనుసంధానింపజేసి తరింపజేసే అట్టి సర్వోన్నతమైన సుజ్ఞ్యాన సాధనమే శ్రీహరిసంకీర్తనం అని...
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు ఈ క్రింది పంక్తుల్లో ఎంతో గొప్పగా సెలవిచ్చారు...

హరి యనురెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు 
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమున జదివినపుణ్యములు
పరమతపోయోగంబులు మొదలగుబహుసాధనములసారంబు 
పరిపక్వంబై ఫలియించగా బట్టబయలు వెదకనేలా

https://annamacharya-lyrics.blogspot.com/2007/11/336-trikaranasuddhiga-jesinapanulaku.html?m=1

అంతగా పరిచయం లేని వారికి ఒక బ్రహ్మవిద్యగా అనిపించే సంగీతశాస్త్రం అవగతమవకున్నా కూడా భక్తితో విన్నంత మాత్రాన, చదివినంతమాత్రాన, ఆలపించినంత మాత్రాన, అందలి ప్రతిపాదిత పరతత్త్వవిశేషగ్రాహ్యతచే భక్తోద్ధరణగావింపబడే విధంగా రచింపబడినట్టి శ్రీతాళ్ళపాక వారి శ్రీవేంకట ముద్రాంకిత శ్రీహరిసంకీర్తనలు
ఈ నవయుగ భక్తలోకానికి అందివచ్చిన కామధేనువులు, కల్పవృక్షాలు, చింతామణులు, చిరంతన అక్షయామరద్యుతిప్రకటిత శ్రీహరిసాలగ్రామ గుళికలు....

కామధేనువును ఎవ్వరైనా అపహరించుకొని వెళ్ళొచ్చు...
కల్పవృక్షం రోజుకు ఒక్క ధర్మేప్సితాన్ని మాత్రమే అనుగ్రహించును....
నిరంతర బాహ్యాంతరశౌచంతో మాత్రమే చింతామణి ఈప్సితములను ఈడేర్చును....
అయిననూ ఇవన్నీ భూలోకస్థిత వాసులకు అలభ్యమై ఉన్నవి...
శ్రీహరిసాలగ్రామాలను ఆరాధించాలంటే ఎంతో నియమభరిత నిత్యారాధనావిధానం సువ్యవస్థీకరింపబడి ఉండాలి....

కాని శ్రీహరిసంకీర్తన అనే సరళమైన సర్వజనశ్రేయోదాయకమైన
సర్వలోకహితకరమైన సారససారస్వతసంపత్తు అనేది....
కరమున ఇమిడిన కైనిధివంటిది...
గంగాజలంలా, తులసిమొక్కలా, అగ్నితప్తస్వఛ్చమైన స్వర్ణమంజూషాంతరస్థిత మాధవపదార్ధంలా....
సర్వకాలసర్వావస్థల్లోనూ పరమపవిత్రమైన, పరమశక్తివంతమైన, పరమశ్రేయోదాయకమైన,
పరతత్త్వసాధనం.....!

ప|| ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి | యిదిగాక వైభవం బికనొకటి కలదా ||

చ|| అతివ జన్మము సఫలమై పరమ యోగివలె | 
నితర మోహాపేక్షలిన్నియును విడచె
సతి కోరికలు మహాశాంతమై యిదెచూడ | 
సతత విజ్ఞాన వాసన వోలె నుండె ||

చ|| తరుణి హౄదయము కౄతార్థతబొంది విభుమీది | పరవశానంద సంపదకు నిరవాయి
సరసిజాసన మనోజయమంది యింతలో | 
సరి లేక మనసు నిశ్చల భావమాయ ||

చ|| శ్రీవేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ | 
భావంబు నిజము గాబట్టి జెలియాత్మ |
దేవోత్తముని కౄపాధీనురాలై యిపుడు | 
లావణ్యవతికి నుల్లంబు తిరుమాయ ||

https://annamacharya-lyrics.blogspot.com/2007/08/294-idigaka-saubagyamidigaka.html?m=1

అందుకే శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులు అమితమైన ప్రేమతో తమనుతాము నాయికగా, శ్రీవారిని నాయకుడిగా భావిస్తూ పైకి శృంగారసస్ఫోరక సంకీర్తనగా అనిపించేలా రచించి...
నిధిధ్యాసనావస్థలో పరమాత్మపట్ల అంకురించే మిక్కుటమైన ప్రేమతో పరవశిస్తూ ఉండే జీవాత్మపరమాత్మానుసంధానభావలహరిలో ఆద్యంతరహితమైన పరతత్త్వ చింతనతో మాత్రమే
పట్టుబడే పరతత్త్వ వైభవాన్ని
"దేవోత్తముని కౄపాధీనురాలై" 
అని ఎంతో చమత్కరిస్తూ వర్ణించారు.....

"కృపాధీనురాలై"
అనే వచనాన్ని మనం గమనిస్తే...
అధీనం అంటే స్వాధీన పరచుకొనుట అని సమాన్యార్ధం....

కృపతో స్వాధీనపరుచుకోవడం అని అనడం చాల వింతైన విశేషం.....

ఇక్కడ అసలైన అర్ధం ఏంటంటే....
స్వామివారి భక్తిలహరుల్లో విహరించే జీవుడు తత్ భక్తిజనిత
సర్వస్యశరణాగతితో స్వామివారితో మమేకమై ఉన్నప్పుడు స్వామివారిచే వర్షింపబడే అమేయకృపకు దాసులై అనగా తమంత తాముగా అధీనులై ఉండి పరత్తత్వవైభవం గురించిన ఎరుకతో వర్ధిల్లడం.....

మనం నిత్యం పఠించే శ్రీలలితాసహస్రనామాల్లో ఈ క్రింది నామం గురించిన సామ్యముతో మనం యోచించినచో ఎల్లప్పుడు శివ వైభవానికి స్వాధీనమై ఉండే శివ వల్లభియే శివా... 
అని ఒక వ్యాఖ్యానం... 

"శివా స్వాధీన వల్లభా"

అనగా ప్రకృతి ఎల్లపుడూ పమాత్మయొక్క వైభవానికి, కృపకు, అనుగ్రహానికి స్వాధీనమై వర్ధిల్లును అని ఆంతరాత్ధం....

జీవుడు / భక్తుడు ప్రకృతికి సంకేతమైతే....
జీవేశ్వరుడైన పరమాత్మ శ్రీవేంకటేశ్వరుడిగా కొలువై తనను మిక్కుటముగా ఆరాధించే భక్తులను అత్యంతకృపతో అనుగ్రహిస్తూ వారికీ వల్లభుడై, శ్రీవేంకటాచలవల్లభుడై వర్ధిల్లుతున్నాడు అని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులు ఎంతో రసరమ్యంగా పరతత్త్వప్రతిపాదనను తమ సుందరమైన శృతిశోభిత పదాల్లో రక్తికట్టించారు.....

శ్రీభూ సమేత శ్రీవేంకటశైలవల్లభుడు సదా తన భక్తులకు స్వాధీనవల్లభుడై పరిఢవిల్లాలని అభిలషిస్తూ,
సర్వం శ్రీ తాళ్ళపాక అన్నమార్యనుత అమరవందిత ఆనందనిలయస్థిత అనంతశయన శ్రీచరణారవిందార్పణమస్తు....🙂💐🙏

No comments:

Post a Comment