Tuesday, April 22, 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆర్ద్ర ప్రయుక్త భృగువాసర వైశాఖ శుద్ధ పంచమి (02-మే-2025) శ్రీఆదిశంకరజయంత్యుత్సవ శుభాభినందనలు...🙂💐🙏

శ్రీఆదిశంకరజయంత్యుత్సవ శుభాభినందనలు...🙂💐🙏

1.శ్రీ ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం....
2.శ్రీ రామానుజాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంతం....
3.శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం...

అనే సిద్ధాంతత్రయతత్త్వసౌధాలపైనే యావద్ భారతదేశ సనాతనధర్మవైభవం వర్ధిల్లుతూ ఉన్నది...

జీవుడు వేరు..దేవుడు వేరు....
అనే సహజమైన ద్వైదీభావనయొక్క తత్త్వదర్శనం శ్రీమధ్వాచార్యుల ద్వైత సంప్రదాయ దర్శనం...
అనగా...
భుజింపబడుతున్న అన్నం వేరు...
భుజిస్తున్న శరీరం వేరు...
అనే తత్త్వదర్శనమే ద్వైతసంప్రదాయ దర్శనం......

జీవజీవేశ్వర సంఘాతంలోని జీవేశ్వరుణ్ణి విశిష్టమైన రీతిలో ఆరాధిస్తూ, భగవంతుడిగా తెలుసుకొని తరించడమే శ్రీ రామానుజాచార్యుల విశిష్టాద్వైతసంప్రదాయ దర్శనం...
అనగా...
భుజింపబడుతున్న అన్నమే 
భుజించే శరీరంగా పరిణమించును...
కాబట్టి అన్నము పరబ్రహ్మస్వరూపమై ఒప్పారుచున్న కారణంగా ఎంతో విశిష్టమైన అన్నమే పరమాత్మ అనే తత్త్వదర్శనమే శ్రీరామానుజాచార్యుల విశిష్టాద్వైతసంప్రదాయ దర్శనం...

జీవజీవేశ్వర సంఘాతమే అభిన్నమైన జీవాత్మపరమాత్మ తత్త్వం..
భగవదారాధనలోని తారాస్థాయిలో, ఆరాధింపబడే భగవద్ తత్త్వానికి, ఆరాధించే భక్తుడికి, భేదం ఉండని రీతిలో ఏకత్వసిద్ధి సంప్రాప్తించును కాబట్టి జీవుడు దేవుడు ఒక్కరే అని తెలుసుకొని తరించడమే శ్రీ ఆదిశంకరాచార్యుల
అద్వైతసంప్రదాయ దర్శనం...
అనగా...
భుజింపబడుతున్న అన్నమే భుజించే శరీరంగా పరిణమిస్తూ ఉండును...
కాబట్టి భుజింపబడే అన్నానికి, భుజించే శరీరానికి అభేదం...
అనే తత్త్వదర్శనమే శ్రీ ఆదిశంకరాచార్యుల అద్వైతసంప్రదాయ దర్శనం...

ఈ మూడు సిద్ధాంతాలు కూడా సత్యమే....
ఈ మూడు సిద్ధాంతాలు కూడా వేటికవే వాటివాటి ప్రత్యేకతలు కలిగి ఉన్నవి....
ఈ మూడు సిద్ధాంతాలు కూడా భక్తుణ్ణి భగవంతుడి తీరానికి చేర్చే ఆరాధనా / సాధనా మార్గాలై వర్ధిల్లుచున్నవి....

చెరుకు భగవంతుడికి ప్రతీక...
(శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం)

చెరుకు రసం భగవద్ తత్త్వానికి ప్రతీక....
(శ్రీ రామానుజాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంతం)

చెరుకురసం నుండి సంప్రాప్తించే నిలవదోషం లేని బెల్లం ఘనీభవించిన శాశ్వతమైన, నిత్యసత్యమైన, నిరాకార నిర్వికార ప్రత్యక్ష భగవద్ దీపికకు ప్రతీక....
(శ్రీ ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం)

ఫలాన చోట చెరుకుచేను ఉన్నది..
వెళ్ళి స్వీకరించి తరించండి...
(శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం)

ఫలాన చోట ఉండే చెరుకుచేను దెగ్గరికి వెళ్ళి, ఫలాన పెద్దాయన ఇచ్చే ఆ చెరుకు యొక్క రసాన్ని స్వీకరించి తరించండి...
(శ్రీ రామానుజాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంతం)

ఫలాన చోట ఉండే చెరుకుచేను దెగ్గరికి వెళ్ళి, ఫలాన పెద్దాయన ఇచ్చే ఆ చెరుకు యొక్క రసాన్ని స్వీకరించి ఇవ్విధంగా ఒక పాచక పద్ధతిలో తపింపజేయగా ప్రభవించే నిలవదోషం లేని బెల్లానికి మీకు విహితమైన నామరూపాత్మక విశేషాలను ఆపాదించి, స్వీకరించి తరించండి....
(శ్రీ ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం)

ఇక్కడ చెరుకు అనే పరతత్త్వ పదార్ధాన్ని ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా సంగ్రహించి అందలి సారాన్ని వివిధ రీతుల గ్రహించి, తరిస్తున్నారు....

అవ్విధముగనే...
భగవంతుడు అనే పరతత్త్వ పదార్ధాన్ని ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా సంగ్రహించి అందలి సారాన్ని వివిధ రీతుల గ్రహించి, తరిస్తున్నారు....

ఈ మూడు తత్త్వదర్శనాల్లోనూ ఎక్కడా కూడా ఎక్కువతక్కువలు, భేదభావాలు, ఇత్యాది వాటికి తావులేదు...
కేవలం ఆయా సంప్రదాయ ఆచరణమార్గంలో వైవిధ్యం ఉన్నది...

అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే....
జిజ్ఞ్యాస, దాహం, ఆకలి
అనే ప్రాకృతిక తత్త్వ సమన్వయానికి సమాధానాలుగా
ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం 
అనే తత్త్వసంప్రదాయాలు ఆవిర్భవించాయి అని విజ్ఞ్యులు గ్రహించవలసి ఉంటుంది...
మరియు తత్త్వసంప్రదాయానికి, అర్చారాధనాసంప్రదాయానికి గల అంతరం, అందలి ఆంతర్యం కూడా విజ్ఞ్యులు గ్రహించవలసి ఉంటుంది..
అట్టి భగవద్తత్త్వగ్రాహ్యలేమివల్లే కొందరి అపరిపక్వతత్త్వభావన, మౌఢ్యం ఆస్తిక సమాజాన్ని పెడద్రోవపట్టించి పనికిరాని ప్రశ్నలను, సిద్ధాంతాలను తెరమీదికి తెచ్చి సామాన్యులకు ఆధ్యాత్మికత యొక్క అసలైన అర్ధాన్ని తెలియజెప్పడంలో
కొందరు సంకుచిత తత్త్వవాదుల ఆస్తికవాదం తడబడుతున్నది...

ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనేవి భగవద్తత్త్వగ్రాహ్య సంప్రదాయాలు...
గాణాపత్యం, శ్రీవైష్ణవం, శాక్తేయం, శైవం, సౌరం అనేవి 
అర్చారాధనా సంప్రదాయాలు...

కాబట్టి ఏది ఎక్కువ, ఏది తక్కువ,
ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ,
ఎవరు జగద్గురువులు, ఇత్యాది అర్ధంలేని ప్రశ్నలు, వాదాలు, అభిప్రాయాలు ఆస్తికవాదం యొక్క గౌరవానికి కళంకంగా పరిణమించే అంశాలుగా విజ్ఞ్యులచే భావింపబడుచున్నవి...

మీరు ఆరాధించే భగవద్ తత్త్వసంప్రదాయానికి...
మీరు ఆచరించే భగవద్ అర్చనాసంప్రదాయానికి...
మరియు వీటి యొక్క సమన్వయానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను...

మీరు...
"భగవద్ బంధువులందరికీ సాదర స్వాగతం..."
అని వచించినప్పుడు మీ చిత్తం ద్వైతతత్త్వప్రస్తుతిలో ఉన్నది...

మీరు...
"ఇవ్విధముగా మన పెరుమాళ్ళ సేవలో మనం తరించడం మనందరి సౌభాగ్యం..."
అని వచించినప్పుడు మీ చిత్తం విశిష్టాద్వైతతత్త్వప్రస్తుతిలో ఉన్నది...

మీరు...
"శ్రీసీతారాముల అట్టి ఆచరణే మనకు స్ఫూర్తి, మార్గదర్శనం, అనుసరణీయం..." 
అని వచించినప్పుడు మీ చిత్తం అద్వైతతత్త్వప్రస్తుతిలో ఉన్నది...

మీ పెద్దల, పూర్వీకుల నైసర్గికాచారానుగుణంగా...
మీ పూజామందిర భగవద్ సిమ్హాసనమునందు ఏ భగవద్ తత్త్వం యొక్క నామము, స్వరూపము కొలువై ఉండునో...
ఆ సంప్రదాయాన్ని మీరు ఆచరిస్తున్నట్టు అర్ధం....
తదనుగుణంగా..
గాణాపత్యులు, శ్రీవైష్ణవులు, శాక్తేయులు, శైవులు, సౌరులు...
అనే పేర్లతో భగవద్ అర్చారాధనా సంప్రదాయం గౌరవించబడుతున్నది...

మీరు స్మార్తులైనచో...,
మీ పంచాయతన ఆరాధనలో, శ్రీ ఆదిశంకరాచార్యులచే స్థిరీకరింపబడిన 
గణపతి,
లక్ష్మీనారాయణ,
జగదాంబిక,
శివ,
సూర్య,
అనే పంచ భగవద్ తత్త్వ మూర్తుల్లో, పూజామందిర సిమ్హాసనమునందు మధ్యలో, మీ ఇంటి పెద్దలు, పూర్వీకులు వారివారి నైసర్గికాచారానుగుణంగా ఆరాధిస్తూవస్తున్న భగవద్ తత్త్వం యొక్క నామము, స్వరూపము కొలువై ఉండి,
ఇతర భగవద్ తత్త్వ నామరూపములు పరివారదేవతలుగా చుట్టూ కొలువై ఉందురు...

మీరు మీ యొక్క పరంపరాగతమైన దైవాన్ని ఆరాధించడం అనునది ద్వైత సంప్రదాయాన్ని గౌరవించడం అనబడుతుంది...

మీరు మీ యొక్క పరంపరాగతమైన దైవాన్ని విశేషంగా ఆరాధిస్తూ అందలి విశిష్టమైన తత్త్వార్ధాన్ని గ్రహిస్తూ తరించడం అనునది విశిష్టాద్వైత సంప్రదాయాన్ని గౌరవించడం అనబడుతుంది...

మీరు మీ యొక్క పరంపరాగతమైన దైవాన్ని విశేషంగా ఆరాధిస్తూ అందలి విశిష్టమైన తత్త్వార్ధాన్ని గ్రహిస్తూ, ఆ భగవద్ తత్త్వానికి మిమ్మల్నిమీరు సాక్షిగా స్థిరీకరించుకొనే తత్త్వదర్శనం అనునది అద్వైత సంప్రదాయాన్ని గౌరవించడం అనబడుతుంది.....

ఇంటినుండి ఓలా / ఊబర్ క్యాబ్ ఎక్కి, బస్ లో ఏర్పోర్ట్ కి చేరుకొని, ఏర్ లుఫ్థాన్స లో ప్రయాణించి వయా ఫ్రాంక్ఫర్ట్ సాన్ఫ్రాన్సిస్కో చేరుకోవడం అనేది ప్రయాణం యొక్క క్రోనాలాజికల్ ఆర్డర్....
ఇందులో ఏది కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు...
అవన్నీ కూడా మన గమ్యానికి గొనిపోవు వివిధ మార్గములు / ప్రయాణ సాధనములు...

అవ్విధముగనే...

మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలంటే...

ద్వైత సంప్రదాయంలో ఉన్న చిత్తవైభవానికి భగవద్ తత్త్వం పట్ల సరైన ఎరుకను కలిగించి.., 

విశిష్టాద్వైత సంప్రదాయానికి చేరుకున్న చిత్తవైభవానికి భగవద్ తత్త్వం యొక్క మహత్తును నిత్యం ఆపాదించి తరిస్తూ..., 
 
అద్వైత సంప్రదాయానికి చేరుకున్న చిత్తవైభవానికి భగవద్ తత్త్వం యొక్క సాక్షిత్వాన్ని వహించే చిత్తవైభవమే జీవజీవేశ్వరాభిన్నమైన పరమేశ్వర అద్వైతస్థితి గా ఎరుకలోకి వచ్చిన ధీశక్తియే పరమాత్మ....
అని తెలుసుకొని తరించడమే భగవదారాధనలోని వైభవం, విశేషం, మాహాత్మ్యం...

ఇదంతా కొంచెం కాంప్లెక్స్ గా అనిపించవచ్చు నాయనా....
కొంచెం సింపుల్ పరిభాషలో చెప్తే బావుంటుంది కద...
అని అనుకునే వారికి కొంచెం సింపుల్ గా చెప్తా....

కొందరు...
"మేము భోజనంగా బియ్యం / అన్నం, తోటకూర మాత్రమే భుజిస్తాము..." అని...
మరికొందరు...
"మేము భోజనంగా గోధుమ రొట్టెలు, పాలకూర మాత్రమే భుజిస్తాము..." అని..
ఇంకొందరు...
"మేము భోజనంగా పిజ్జా బర్గర్ మాత్రమే భుజిస్తాము..." అని...
ఇంకొందరు...
"మేము భోజనంగా పైన పేర్కొనబడినవన్నీ భుజిస్తాము..." అని...
ఇంకొందరు...
"మేము భోజనంగా పైన పేర్కొనబడినవన్నీ, మరియు ఈ లోకంలో లభ్యమయ్యే ఇతర భోజ్య పదార్ధాలన్నీ భుజిస్తాము..." అని...
అంటే....
దాని అర్ధం లోకో భిన్నరుచిః...
కాబట్టి ఎవరికి నచ్చినవి, లేక ఎవరికి ఉపయుక్తమైనవి వారు భుజించడం అనేది లోకరీతి...

కాబట్టి, ఫలాన పదార్ధాలను భుజించే వారు ఎక్కువ....
ఫలాన  పదార్ధాలను భుజించే వారు తక్కువ..
అనే ప్రశ్నే అర్ధంలేని ప్రశ్న....
ఇక ఫలానా పదార్ధం ఎక్కువ...ఫలానా పదార్ధం తక్కువ...
అనే ప్రశ్న ఎట్లు ఉత్పన్నమౌను...?

అనగా, ఫలాన దేవతా నామ రూపములను ఆరాధించే వారు ఎక్కువ....
ఫలాన దేవతా నామ రూపములను ఆరాధించే వారు తక్కువ..
అనే ప్రశ్నే అర్ధంలేని ప్రశ్న....
ఇక ఫలానా దేవుడు ఎక్కువ...ఫలానా దేవుడు తక్కువ...
అనే ప్రశ్న ఎట్లు ఉత్పన్నమౌను...?

శ్రీచాగంటి సద్గురువుల శ్రీశంకరవిజయం /మాధవీయశ్రీశంకరవిజయం, శివానందలహరి, సౌందర్యలహరి,
కనకధారాస్తోత్రం, ఇత్యాది ప్రవచనాలు, విన్నవారికి గుర్తున్నట్టుగా...
శ్రీచాగంటి సద్గురువులు శ్రీఆదిశంకరుల గురించి ఒక గొప్ప వాక్యాన్ని ప్రస్తుతించారు....
""Can there be anyone who can talk as best as ShreeAadiShankara...?"

ఎందుకంటే వారు సాక్షరసారంగా అందించిన సకల దేవతాతత్వార్ధసారస్వత పెన్నిధి అట్టిది...
అది వారు నుడివిననాటి నుండి నేటి వరకు మరియు ఎప్పటికీ కూడా అమృతతుల్యమైన భగవదనుగ్రహదాయక బ్రహ్మపదార్ధమై వర్ధిల్లుచూఉన్నది...

"మీరు ఫలాన దేవతా నామ రూప తత్త్వ సంప్రదాయాన్ని ఆరాధించండి..." అని చెప్పినందుకు కాదు....
"మీరు ఫలాన దేవతా నామ రూప తత్త్వ సంప్రదాయాన్ని ఫలాన పద్ధతిలో ఆరాధిస్తూ శ్రేయోకరమైన అనుగ్రహన్ని అందుకొని తరించండి..." 
అని సకలదేవతారాధనా సంప్రదాయాలను సువ్యవస్థీకరించి ఆస్తికలోకానికి అందించినందుకు,
వారు జగద్గురువులై, సనాతన భారతదేశం యొక్క హృదయం ఎప్పటికీ విహిత కర్తవ్య ప్రయుక్త ధర్మాచరణభరిత దేవతారాధనా వైభవంతో పరిఢవిల్లుతూ ఉండాలనే సత్సంకల్పంతో నెలకొల్పిన చతురామ్నయా పీఠాలను పరంపరాగతంగా అధిరోహించే బ్రహ్మవేత్తలు వారిలా జగద్గురువులుగా ఆరాధింపబడేదరుగాక అని ఆస్తికలోకాన్ని శాసించి అనుగ్రహించారు...

ఈ 4 చతురామ్నాయ పీఠాలకు గురుస్థానంగా నెలకొల్పబడిన దక్షిణభారత కన్నడప్రదేశ శృంగేరి శారదా పీఠాధీశులైన బ్రహ్మవేత్తలు, ఈ భారతదేశంలోని అన్ని ఆస్తిక వ్యవస్థలకు కూడా జగద్గురువులై వర్ధిల్లుతూ భక్తులెల్లరినీ అనుగ్రహిస్తూ పరిఢవిల్లడం అనేది అనాదిగా ఈ భారతదేశం యొక్క ఆస్తిక వైభవానికి ఆధారమై ఉన్నది...

శ్రీఆదిశంకరాచార్యుల శ్రీచరణాలకు ప్రణమిల్లే 
శ్రీచాగంటి సద్గురువుల శ్రీచరణాలకు,
జగద్గురు శ్రీభారతీతీర్థ స్వామివార్ల శ్రీచరణాలకు, 
ఉత్తరపీఠాధిపతులైన శ్రీవిదుశేఖరభారతీ స్వామివార్ల శ్రీచరణాలకు ,
మరియు శ్రీఆదిశంకరుల హృదయాన్ని ఆవిష్కరించే ఆస్తికవరేణ్యులెల్లరికీ, 
ప్రణమిల్లుతూ....,
శ్రీఆదిశంకరకృపతో ఆస్తిక లోకం ఎప్పటికీ అమరుల అనుగ్రహంతో ధర్మార్ధకామ్యమోక్షములుగా వ్యవహరింపబడే చతుర్విధపురుషార్ధాలను అందుకొని తరిస్తూ వర్ధిల్లెదరని ఆకాంక్షిస్తూ...,
విజ్ఞ్యులెల్లరికీ శ్రీఅదిశంకరజయంత్యుత్సవ శుభాభినందనానమస్సుమాంజలి....🙂🙏💐

(ఇట్టి పర్వసమయంలో, శ్రీఆదిశంకరభగవద్పాదుల శ్రీచరణాలకు సభక్తికంగా సమర్పింపబడే సారస్వత నమస్సుమాంజలిగా "తోటకాష్టకం" ఖ్యాతి గడించిన కారణంగా భక్తులెల్లరూ తోటకాష్టకాన్ని పఠించి తరించెదరు గాక... 💐)

శ్రీశంకరభానవేనమః...🙏💐🙂

శివారాధనలోని వైభవాన్ని, మహత్తును ఈశ్వరానుగ్రహంగా కొంత పరికిద్దాం...


శివారాధనలోని వైభవాన్ని, మహత్తును ఈశ్వరానుగ్రహంగా కొంత పరికిద్దాం....

హిరణాక్ష హిరణ్యకశిపులు,
రావణ కుంభకర్ణులు,
శిశుపాలదంతవక్త్రులు...
ఇత్యాది అసురులు పరమేశ్వరారాధానతో గొప్ప శక్తియుక్తులను గడించారు...

వరాహస్వామి, నృసిమ్హస్వామి,
శ్రీరామలక్ష్మణులు,
శ్రీకృష్ణబలరాములు, 
ఇత్యాది సురులు కూడా పరమేశ్వరారాధానతో గొప్ప శక్తియుక్తులను గడించారు...

అసురుల గురువులైన శుక్రాచార్యులు మరియు దేవగురు బృహస్పతి వారు కూడా పరమేశ్వరారాధానతో గొప్ప శక్తియుక్తులను గడించారు...

దేవాధిదేవుడు, దేవతాసార్వభౌముడైన శ్రీఅనంతపద్మనాభస్వామి వారు శివారాధనాదురంధరులే...
శ్రీఅనంతపద్మనాభస్వామి వారు శివలింగం యొక్క పరమేశ్వర పంచాస్య వైభవంలోని ఊర్ధ్వముఖ వదనమైన ఈశాన వదనంపై వారి హస్తాన్ని అలంకరించి శయనించడం అనే అధ్యాత్మ అంశం యొక్క ఆంతర్యం తెలిస్తే మీరు...
"ఓహ్ శివలింగారాధనలో ఇంతటి గహనమైన అధ్యాత్మవిశేషం ఉన్నదా..." అని ఎంతో ఆశ్చర్యం చెందుతారు...!
(కొన్ని దేవరహస్యాలను గౌరవించాలి కాబట్టి నేను ఆ ఆంతర్యం గురించి పరిధి దాటి వివరించజాలను...
అది విజ్ఞ్యులకు ఈశ్వరానుగ్రహంగా ధ్యానగోచరమయ్యే అంశం..)

అనే పౌరాణిక సత్యం విజ్ఞ్యులకు విదితమే....

అసురుల శివారాధన వారి పతనానికి వారే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థగా పరిణమించును...
దేవతల శివారాధన ఎల్లరికీ అభ్యున్నతిని అనుగ్రహించే వ్యవస్థగా పరిణమించును...

శివారాధనతో...
రావణాది అసురులు ఎంతో బుద్ధిబలాన్ని, ఐశ్వర్యాన్ని అందుకున్నారు...
శ్రీరాముడి వంటి సుక్షత్రియవీరులు కూడా ఎంతో బుద్ధిబలాన్ని, ఐశ్వర్యాన్ని అందుకున్నారు...

కాని ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే...
దేవతల / దేవతానుగ్రహాన్ని నిత్యం సముపార్జించుకునే విజ్ఞ్యుల యొక్క శివారాధన వైభవమనేది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిచే నిత్యం సమ్రక్షింపబడే విశేషం...
అసురుల శివారాధన వైభవమనేది తామరాకుపై కొలువైన నీటిబిందువు వంటిది...

రావణుడి శివారాధనా వైభవం గురించి సింపుల్ గా చెప్పాలంటే...
నిత్య శివలింగాభిషేకదురంధరుడైన
ఆతడు ఎంతటి పరమేశ్వరానుగ్రహాన్ని సముపార్జించాడంటే...

ఆకాశంలో సూర్యుడి ప్రకాశం / ప్రతాపం ఎక్కువైన్నట్టు అతడికి అనిపిస్తే...
ఎర్రబడ్డ అతని కనుసైగకి సూర్యుడు తనంత తానుగా తన శక్తిని క్షీణింపజేసుకొని రావణుడికి ఇబ్బంది కలగని రీతిలో ప్రకాశించాలి....

తను ఉన్న చోట గాలి ఎక్కువగా వీచి సుడిగాలిగా మారుతున్నట్టుగా అతడికి అనిపిస్తే...
ఎర్రబడ్డ అతని కనుసైగకి వాయుదేవుడు తనంత తానుగా తన శక్తిని క్షీణింపజేసుకొని రావణుడికి ఇబ్బంది కలగని రీతిలో మలయమారుతమై మెలగాలి....

ఇత్యాదిగా పంచభూతాలపై కూడా ఎనలేని పట్టును సాధించుకున్న పౌలస్త్యుడి పరమేశ్వరానుగ్రహానికి
తగ్గట్టుగానే ఆతడి ఐశ్వర్యం కూడా వెలకట్టలేనంత రాశి...

శ్రీచాగంటి సద్గురువుల "సంపూర్ణ శ్రీమద్రామాయణం" ప్రవచనాల్లో విన్నవారికి గుర్తున్నట్టుగా....
ఆతడి కాంచనలంకలో ఉండే చీనీచీనాంబరములు / తివాచీల వైభవం గురించి వర్ణించాలంటే ఏ ఉపమానాలు సరిపోలవు....
అంతటి ఐశ్వర్యభరితమైన లంకంత కొంప....రావణుడిది..

శ్రీరాముడి శివారాధనా వైభవం గురించి సింపుల్ గా చెప్పాలంటే...
అపర రుద్రాంశసంభూతుడైన హనుమంతుల వారిచే నిత్యం ఆశ్రయింపబడి ఉండే శ్రీరాముడు ఎంతటి పరమేశ్వరానుగ్రహాన్ని సముపార్జించాడంటే...

తన సచివుడైన హనుమంతుల వారు శ్రీరాముడితో నెరపిన అగ్నిసాక్షి మైత్రికి సంతసించిన సుగ్రీవుడు, తన అన్న వాలి యొక్క శక్తి గురించి, 
ప్రత్యర్ధిగా ఎవరైనా వాలికి ఎదురునిలిస్తే ఆ ప్రత్యర్ధి యొక్క సగం బలాన్ని హరించివేయగల వాలికి గల వరం గురించి వివరించి...,
ఎందుకైనా మంచిది శ్రీరాముడి శక్తియుక్తులు ఒకసారి పరీక్షిస్తే బావుంటుంది కద....అని అనుకొని...,
వాలి చేతిలో హతుడైన దుందుభి అనే అసురుడి కొండంత అస్తిపంజరాన్ని చూపించి, ఇది తన అన్న శక్తికి నిదర్శనం అని పలికిన సుగ్రీవుణ్ణి చూసి నవ్వుతూ...
శ్రీరాముడు సంకల్పించి ఆ అస్తిపంజరాన్ని గట్టిగా తంతే అది 10 యోజనాల దూరం, అనగా రమారమి మన పరిభాషలో 125 కిలోమీటర్ల దూరం ఎగిరి పడింది...!

శ్రీరాముడి ధనుర్విద్యాకౌశలాన్ని కూడా ఒకసారి పరీక్షిస్తే మంచిది కదా అని అనుకొని...
సుగ్రీవుడు, ఒకే సరళరేఖలో సమాంతరంగా ఏపుగా ఎదిగిన 7 సాలవృక్షాలను చూపగా...
శ్రీరాముడు తన కోదండంతో ఆకర్ణపర్యంతం లాగి సంధించిన బాణం మెరుపువేగంతో ఆ 7 సాలవృక్షాలను భేదించుకొని వెళ్ళింది....!

సవినయుడై ఎంత ప్రార్ధించినా కూడా సముద్రుడు తనకు నడిచి వెళ్ళడానికి దారి ఇవ్వడం లేదని అనిపించిన శ్రీరాముడు
ఎర్రబడ్డ కన్నలతో ఎక్కుపెట్టిన తిరుగులేని శ్రీరామ బాణానికి సముద్రుడు వెంటనే స్పందించి, నలుడు, నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, ఇత్యాది వానరసేనచే లిఖింపబడే శ్రీరామ నామభూషితమైన కొండలుకూడా తనకు శిరోభూషణంగా సమ్రుద్రపు నీటిపై తేలుతూ ఉండును
అని వచించి కాంచనలంకకు వానరసేన నడిచివెళ్ళడానికి మార్గాన్ని సూచించాడు....
ధనుర్వేదశాస్త్రానుసారంగా ఒక సుక్షత్రియుడు ఎక్కుపెట్టిన అస్త్రం సంధింపబడకుండా ఉండకూడదు కాబట్టి...,
సముద్రుడిపైకి కోపంతో శ్రీరాముడు ఎక్కుపెట్టిన అస్త్రాన్ని, 
ఎందరో రాక్షసులు పోగైఉన్న వేరొక ప్రదేశం దిశగా సంధించగా అసురులపాలిటి అదృశ్యపిడుగై వారిని లయించివేసింది...

శ్రీరామసేన మొత్తం, నిర్జింపనలవికాని అసురుడైన
మాయావి మేఘనాథుడి నాగాస్త్రబంధనంతో అశక్తులై పడిఉన్నప్పుడు సాక్షాత్తు పరమేశ్వర కంఠభూషమైన వాసుకి ఉపవీతంగా గల వైనతేయుడు శ్రీవైకుంఠం నుండి ఏతెంచిమరీ తన గారుత్మతశక్తిని ప్రసరించి వారందరికీ కూడా స్వస్థతను అనుగ్రహించి, "ఓ మిత్రమా నీవెవరవు...?"
అని శ్రీరాముడు అడగగా...ప్రస్తుతానికి నీకు నేనొక ఆప్తమితృణ్ణి అనుకో..." అని గరుత్మంతుడు సెలవిచ్చిన శ్రీమద్రామాయణ వృత్తాంతం మనకు శ్రీరాముణ్ణి నిత్యం ఆశ్రయించి ఉండే పరమేశ్వర శక్తి గురించి విశదపరచును...

నాగస్త్రము, గరుడాస్త్రము, ఆగ్నేయాస్త్రము, ఐంద్రాస్త్రము, వారుణాస్త్రము, ఇత్యాది దేవతాస్త్రాలు, అనగా ఆయా దేవతా శక్తులు మనకు కనిపిస్తాయా....?
అనే కొంటే ప్రశ్నలను కొందరు అడగొచ్చు...

ఒక నార్మల్ ట్యూబ్లైట్ నే 5 నిమిషాలపాటు కళ్ళార్పకుండా చూడలేని సామన్యమానవుల కళ్ళకు, 100 సూర్యబింబాలు ఒక్కటై ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యే రీతిలో దివిలో మెరిసే దివిజుల శక్తిని సాధారణ కళ్ళతో చూడగలం అని అనుకోవడం ఎంతవరకు సమంజసం...?
"దర్శించగల పుణ్యము, శౌచము ఉంటేనే, దేవతలు అనుగ్రహిస్తేనే, వారి ద్యుతిని, శక్తిని దర్శించగలం.." 

కాబట్టి శివారాధన ఎవ్వరూ గావించినా కూడా వారెల్లరికీ అమేయమైన ఐశ్వర్యం, జ్ఞ్యానం సమకూరును అనేది జగద్విదితమైన అంశం...

మరి అసురులకు, దేవతలకు, మరియు వారికి గల శివారాధనాశక్తికి భేదం ఎక్కడ ఉన్నది...అని అంటే...
అది వారివారి ధర్మాచరణ యందు...అని అనవలసి ఉంటుంది...

శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మార్తుడు....
అడుగు తీసి అడుగువేస్తే ధర్మదేవతేనడిచిన రీతిలో ఉండును శ్రీరాముడి యొక్క ధర్మనిరతి....

అందుకే...
దశేంద్రియసంఘాతమైన తనువంతా కూడా శివమయమైన శక్తితో ఉన్న శ్రీరాముడి ధర్మనిరతియే లోకంలో అప్పటివరకూ లేని సరికొత్త ధర్మాస్త్రమై, 
ఎవ్వరిచేతా కూడా సాధారణంగా నిర్జింపనలవి కాని దశకంఠసుతుడైన ఇంద్రజిత్ ని, హనుమ సౌమిత్రి కలిసి లయింపజేసారు....

అధ్యాత్మపరంగా...
హనుమ ఆచార్యులకు అనగా దేవగురు బృహస్పతికి ప్రతీక....
సౌమిత్రి ఆదిశేషుడికి ప్రతీక...
అనగా ధర్మస్వరూపుడైన పరమాత్మను / శ్రీమహావిష్ణువును
వహించే శక్తికి ప్రతీక...

కాబట్టి ఇక్కడ

" ధర్మం + యుక్తి + శక్తి = ధర్మాస్త్రం " అనే సరికొత్త సమీకరణం తో మేఘనాథుడు అనే మాయావి లయించినాడు అని అర్ధం...

అధ్యాత్మపరంగా "మాయావి మేఘనాథుడు" అంటే...
మాయను కల్పించే మన మనస్సు యొక్క శక్తి...
అనగా అంత తెలికగా వశం కాని అధ్యాత్మ వస్తువు మన మనస్సు...
మేఘనాథుడిలా...మన మనస్సు కూడా ఆంతరాకాశంలో మెరుపు వేగంతో ప్రయాణిస్తూ నిరంతరం ప్రాపంచిక మాయలో మనల్ని విహరింపజేస్తూ ఉంటుంది....
అలా నిత్యాంతరవిహారి అయిన మన మనస్సు, తద్వారా మనోమాయ, తద్వరా దశేంద్రితసంఘాతమైన మన శరీరం, తద్వారా మన జీవిత ప్రయాణం, నిత్యం మన అధీనంలో ఉండాలంటే...అందుకు...
"ధర్మం + యుక్తి + శక్తి " అనే మూడింటితో నిత్యం అనుసంధానమౌతూ ఉండవలెను...
అనేది ఇక్కడి అధ్యాత్మ అంతర్యం...

అమేయమైన ఐశ్వర్యం, బలం, జ్ఞ్యానం, వర్చస్సు, తేజస్సు, వైభోగం, విలాసం, ఎన్ని ఉన్నా కూడా ధర్మం అనే అత్యంత ముఖ్యమైన నేస్తం, భూషణం, కవచం, అస్త్రం, లేని కారణంగా రావణుడు పదితలలున్న పౌలస్త్యుడైనా సరే ధర్మస్వరూపుడైన శ్రీరాముడి అస్త్రానికి నేలకొరిగాడు....

ఏది ఎవరికి ధర్మం....
అని అంటే...
"ధృయైర్వా జనైః ఇతి ధర్మం..." అనే వ్యుత్పత్తి ప్రకారంగా...
జనులచే ధరింపబడునది ధర్మం...అని అర్ధం కద...

ఫర్ ఎగ్సాంపుల్....
ఒక డ్రెస్స్ ని ధర్మానికి ఎగ్సాంపుల్ గా భావిద్దాం...
మనం ఎటువంటి డ్రెస్సులను ధరిస్తాము...

మనకు చూడ్డానికి చక్కగా ఉండేది...
మనల్ని చూసేవారికి చక్కగా ఉండేది...
మనకు శ్రేయస్సును కలిగించేది...
మనతో ఉండేవారికి శ్రేయస్సును కలిగించేది...
దేశకాలానుగుణంగా మారేది...

ఇది డ్రెస్స్ / ఆహార్యానికి గల సింపుల్ నిర్వచనం కద...

సాధారణంగా మనకు మన ఇంటి పెద్దవాళ్ళే మంచివారై మంచిమంచి డ్రెస్సులు కొనివ్వాలి...
అలా మన పెద్దలు కొనివ్వని / కొనివ్వలేని పక్షంలో,
పెద్దైన తర్వాత మనకు మనమే మన బుద్ధివైభవంతో, ఈశ్వరానుగ్రహంతో, మనకు ఉచితమైన మంచిమంచి డ్రెస్సులు కొనుక్కొని ధరించి తరించాలి....
కద...

అచ్చం అదే విధంగా....
సాధారణంగా మనకు మన ఇంటి పెద్దవాళ్ళే మంచివారై మనకు మన ధర్మం గురించి తెలియజెప్పాలి...
అలా మన పెద్దలు చెప్పని / చెప్పలేని పక్షంలో,
పెద్దైన తర్వాత మనకు మనమే మన బుద్ధివైభవంతో, ఈశ్వరానుగ్రహంతో, మనకు ఉచితమైన ధర్మాన్ని తెలుసుకొని, ఆచరించి తరించాలి....

అనగా....
"రోజు పొద్దున్నే సూర్యుడికి నమస్కరించి మంచి ఆరోగ్యం తో తరించు..."
"బాగా చదువుకొని స్కూల్ / కాలేజ్ లో మంచి పేరు / మార్కులు / విద్యను సముపార్జించి తరించు..."
"ఉద్యోగ / వ్యాపారాల్లో చక్కగా రాణించి తరించు..."
"నీ భార్య / భర్త / బిడ్డల పట్ల ఉండవలసిన విహిత కర్తవ్యం, అభివృద్ధి గురించి యోచించు..."
"అలాయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి సేవించు...."
"నలుగురు విజ్ఞ్యులు మెచ్చేలా...నలుగురు విజ్ఞ్యులకు ఉపయుక్తమైన జీవితాన్ని జీవించు..."
" 'సర్వే సుజనాః సుఖినోభవంతు...' అనే తీరుగా జీవితాన్ని సార్ధకం గావించు..."

అని దేశకాలనుగుణంగా మనము ధరించవలసిన ధర్మం గురించి ఎరుకకలిగించే విజ్ఞ్యుల ఉవాచయే మనకు ఆయా దేశకాలావలంబిత ధర్మమై ఒప్పారును...

ధర్మదేవతకు ప్రతిరూపమైన శ్రీరాముడికి,
వృషభ వాహనం అనగ ధర్మమే వాహనంగా గల పరమేశ్వరుడికి, నమస్కరిస్తూ....

నాలుగు పాదాలమీద నడయాడవలసిన ధర్మం,
ఈ కలియుగంలో ఒకేఒక పాదంపై నడయాడుతూఉండడం ఈ కలియుగ లక్షణం కావొచ్చు.....
కాని ఏ యుగంలోనైనా సరే...
ధర్మార్ధకామ్యమోక్షాలు అనే చతుర్విధపురుషార్ధాల్లో ధర్మమే ఎల్లప్పుడూ ముఖ్యమైనదిగా వర్ధిల్లింది....
అనగా ధర్మరహితమైన అర్ధకామ్యమోక్షాలు నిరర్ధకమౌను అనేది సారాంశం...

"ధర్మో రక్షతి రక్షితః " అని ఎల్లరికీ తెలియజేస్తూ....
ఈ కలియుగ ప్రత్యక్ష పరమాత్మగా వెలసిన శ్రీవేంకటేశ్వరుడి అనుగ్రహంతో ఎల్లరూ ధర్మాత్ములై వర్ధిల్లెదరు గాక...

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తామ్ 
న్యాయేన్ మార్గేన మహీం మహిషాః ।
గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు ।।

💐💐💐💐💐💐💐💐💐💐💐

షాద్‌నగర్: శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం ప్రతియేటా పెరుగుతూ ఉండడం విశేషం....!

https://m.youtube.com/watch?si=ZMvHI6-Ue2p5jSYs&fbclid=IwZXh0bgNhZW0CMTEAAR6Gu_mxQAccnKaBciOs180ME7XjZa63pF3QobNHAonUCDzQu6T2iS0-Uv3Mwg_aem_rFj4Xy-K8x2PEqchq7nSZQ&v=py3ZdeJ6mqk&feature=youtu.be

చైత్ర శుద్ధ త్రయోదశి వత్సరాబ్దిక సందర్భంగా, నానమ్మ గారి శ్రీచరణాలకు మనవడి సవినయ నమస్సుమాంజలి...💐🙏

ఉన్నంతలో తృప్తిగా బ్రతకడం,
ఉన్నంతలో ఇంత ఇతరులకు కూడా పెట్టడం,
ఉన్నంతలో ఉన్నతంగా బ్రతకడం,
అనే ముఖ్యమైన 3 సూత్రాలను విశ్వసించి, ఆచరించి, 
భర్త, ఆరుగురు కొడుకుల, ఇద్దరు కూతుర్ల, కుటుంబాన్ని నెట్టుకువచ్చి..,
చేతికి బీ.పి బ్రేస్లెట్ ఉన్నా కూడా అనవసరంగా ఏనాడు ఎవ్వర్ని పల్లెత్తు మాట అనకుండా...,ఎవ్వరి అభివృద్ధిపై ఏడవకుండా, ఎవ్వరితో మాటపడకుండా, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా, ఆదర్శజీవితాన్ని జీవించి, అవసాన సమయంలో నడవలేని స్థితిలో అవస్థలు పడుతూ కూడా ఏనాడు జీవితంలో ఎవ్వరికీ తలవంచని ధీరవనితగా, 
నగునూరి చంద్రమ్మ కూతురుగా జన్మించి అయిత నాగమ్మ గా 
భర్తచేతుల్లో నిండుముత్తైదువగా మీరు తనువుచాలించి నేటికి 27 సంవత్సరాలు...
మీ శక్తికి, మీ స్ఫూర్తికి, మీ నిస్వార్ధజీవితప్రయాణధృతికి, తలవంచి నమస్కరిస్తూ....
చైత్ర శుద్ధ త్రయోదశి వత్సరాబ్దిక సందర్భంగా, నానమ్మ గారి శ్రీచరణాలకు మనవడి సవినయ నమస్సుమాంజలి...💐🙏